గంగవరం: పాల ట్యాంకర్ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన మండలంలో బుధువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంలో వ్యతిరేక మార్గంలో వెళ్తున్నాడు. పలమనేరు వైపు అదే మార్గంలో వస్తున్న పాల ట్యాంకర్ మార్గమధ్యంలోని మామడుగు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు.
నానో సైన్స్లో ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని గిరిజన యువతకు నానో సైన్స్లో ఉచిత శిక్షణ ఇస్తారని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి మూర్తి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నత విద్యనభ్యసించిన గిరిజన నిరుద్యోగ యువతీయువకులకు నానో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (న్యూఢిల్లీ) సంయుక్త సమన్వయంతో గిరిజన యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్న్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు. గిరిజన అభ్యర్థులకు ఐఐఎస్సీ ఆధ్వర్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో ప్రోగ్రామ్లను డిజైన్ చేశారన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు www.cense.iisc.ac.in లో ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.


