చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్ సిటీలోని అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో శనివారం 2021–2026 విద్యా సంవత్సరానికి చెందిన 5వ బ్యాచ్ విద్యార్థుల ఫేర్వెల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థు ల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సీనియర్లు, జూనియర్లు కలిసి పంచుకున్న జ్ఞాపకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె.భాస్కర్రెడ్డి మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థులు సేవా భావం, క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ డి.జగదీశన్ మాట్లాడుతూ నర్సింగ్ అనేది నోబుల్ ప్రొఫెషన్ అని పేర్కొన్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 75,688 మంది స్వామిని దర్శించుకున్నారు. 38,264 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనమవుతోంది.


