మైనర్ గ్రామ పంచాయతీల ఆర్థిక దుస్థితిని పరిగణనలోకి తీసుకుని వాటి విద్యుత్ బిల్లులను గతంలో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మైనర్ గ్రామ పంచాయతీలను దెబ్బతీసేలా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకప్పుడు చిన్న గ్రామ పంచాయతీలకు విద్యుత్ చార్జీల నుంచి మినహాయింపు ఉండేది. ఆయా పంచాయతీల్లో వీధి దీపాలు, మంచినీటి పథకాల విద్యుత్ బిల్లులను వసూలు చేసేవారు కాదు. మేజర్ గ్రామ పంచాయతీలు మాత్రం సొంత నిధుల నుంచి ఆ బిల్లులు చెల్లించాలి. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయాలని నోటీసులిచ్చింది. అప్పటి నుంచి మైనర్ గ్రామ పంచాయతీల్లో బకాయిలు పేరుకుపోయాయని అధికారులు చెబుతున్నారు.


