కార్వేటినగరం: మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పగలు తేడా లేకుండా గుట్టలను తవ్వి మట్టిని తరలిస్తోంది. ఈ విషయం తెలిసినా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుత్తూరు– కార్వేటినగరం సరిహద్దుల్లోని చిన్నబ్బనాయుడు కండ్రిగ వద్ద గుట్ట ఉంది. అందులో ఎర్రమట్టి ఉంది. దానిపై కన్నేసిన మాఫియా మూడు రోజులుగా జేసీబీతో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. గుట్టను తవ్వేడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలపై రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
పుత్తూరు–కార్వేటినగరం సరిహద్దులోని గుట్ట నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. మా సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీంచాం. అక్కడ మట్టి తరలించే ట్రాక్టర్లు, టిప్పర్లను తీసుకెళ్లిపోయారు. విచారణ చేపట్టి మట్టిని తరలిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అనుమతులు లేకుండా మట్టి, గ్రావెల్, ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగరాజు, తహసీల్దార్, కార్వేటినగరం


