కుప్పం: శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయ మహోత్సవాల్లో దేవదాయ శాఖ జాడ కనకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా జాతర సంబరాలు జరుగుతున్నా ఆలయ ఈఓ, సిబ్బంది మాత్రం తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఆలయ ప్రాగణంలో జరుతున్న అవకతవకలపై పట్టణ ప్రజలు ముక్తకంఠతో ఖండిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకునిరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినపిస్తున్నారు. జాతరలో జరిగే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇవ్వాలని కోరుతూ క్యూ ఆర్ కోడ్తో బ్యానర్లు వేశారు. తీరా ఆ కోడ్కు డబ్బులు పంపితే అన్న క్యాంటీన్ ఖాతాలో జమవుతుండడంతో స్థానికులు విస్తుపోతున్నారు. జాతరకు తిరుపతి గంగమ్మ దేవాలయ ఖాతా నంబరుకు చెందిన క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేయాలి. కానీ అన్న క్యాంటీన్ సంబంధిత క్యూ ఆర్ కోడ్ బ్యానర్లు వేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. గతంలో జాతర చాటింపు నుంచి ముగిసేంత వరుకు ఆలయ ప్రాణంలో దేవదాయ శాఖ అధికారులు విధులు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది వారి జాడే కానరాకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.


