కుప్పం రూరల్ : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నిత్యం ఏదో చోట అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రభుత్వ ఆస్తుల కబ్జాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కుప్పం మండలం వి.మిట్టపల్లి గ్రామంలో గ్రామస్తుల సౌకర్యార్థం ప్రభుత్వ నిధులతో వేసిన బోరుకు కూటమి నాయకుడు మోటారు బిగించి యథేచ్చగా నీటిని వాడుకుంటున్నాడు. నీటిని వ్యవసాయ పొలానికి పారించుకుంటున్నాడు. దీనిపై గ్రామస్తులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో పొలంలోకి వేసిన పైపులను తొలగించారు. మోటారు మాత్రం బోరు బావిలోనే ఉన్నట్లు గ్రామస్తులు చెప్పారు. అధికారులు స్పందించి ప్రైవేట్ వ్యక్తి వేసుకున్న మోటారును తొలగించి ప్రభుత్వం మోటారు బిగించి గ్రామానికి తాగునీరు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం గిరింపేట బౌండువీధిలోని వేంకటేశ్వర ఆలయ కుంభాభిషేక పూజలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అంకుర్పారణం, వాస్తు హోమం, గణపతి హోమ పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. నిర్వాహకులు సెంథిల్కుమార్, షణ్ముగం, గోపి, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.


