మృతి చెందినవారి అంత్యక్రియల సామగ్రి ఉచితం
12 రకాల వస్తువులతో ఖబరస్థాన్లో అందుబాటు
ముస్లిం యువకుల చేయూత
సమస్యలను చూసి చలించి
పట్టణంలో జీలుబాయి తన స్నేహితులతో కలిసి కులాలతో సంబంధం లేకుండా అనాథలకు అంత్యక్రియలను నిర్వహించడం చేస్తున్నారు. దీంతోపాటు కోవిడ్ సమయంలో తామున్నామంటూ ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఎన్నో రకాల సేవలు చేపట్టారు. ముఖ్యంగా అనాథ శవాలను శ్మశానానికి తరలించేందుకు ఓ వాహనం ఏర్పాటు చేశారు. ఇక అత్యవసర పరిస్థితుల్లోని వారికి మెరుగైన వైద్యం కోసం ఉచిత అంబులెన్స్ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉంచారు. దీనికి తోడు గత రంజాన్ నెలలో ఇంకేదైనా మంచి పని చేయాలనే తలంపుతో ముస్లిం కుటుంబాల్లో ఎవరైనా మృతి చెందితే వారి అంత్యక్రియలకు అవసరనైన సామగ్రిని పలు ప్రాంతాల నుంచి తెచ్చి స్థానిక ఖబరస్థాన్ వద్ద మర్కజ్ గదుల్లో అందుబాటులో ఉంచారు.
పేదలకు ఉచితంగానే సామగ్రి
డబ్బులిచ్చి కొనుక్కునే వారే కాకుండా పేద ముస్లింల కు ఈ వస్తువులకు ఉచితంగానే అందజేస్తున్నట్టు జీలు బాయ్ తెలిపారు. అయితే వీరు పేదలని సంబంధిత మసీదు పెద్దలతో ఓ లెటర్ తీసుకొని వచ్చి ఇక్కడి చూ పెట్టి అంత్యక్రియలకు అవసరమైన సామగ్రిని ఉచి తంగానే పొందేలా చేశారు. దీంతో నియోజకవర్గంలో ని ముస్లింలు వీరి సేవలను కొనియాడుతున్నారు. ఇప్పటి దాకా ఎవరికీ రాని మంచి ఆలోచన చేసిన వీరికి అల్లా కృప ఉంటుందని ఆశీర్వదించుతున్నారు.
ఎన్నికోట్లుండి.. ఎంతో బాగా బతికిన వారుగాని, పేదరికాన్ని అనుభవిస్తూ జీవించిన వారు కావచ్చు చివరకు చేరేది మట్టిలోకే. సాధారణంగా హిందువులకు సంబంధించి ఎవరైనా పేదలు మృతి చెందింతే కొందరు అంత్యక్రియలకు అవసరమైన సామగ్రిని కొనిచ్చి వారికి ఇవ్వడం చూస్తుంటాం. ఇదే తరహాలో పలమనేరులోని కొందరు ముస్లిం యువకులు స్థానిక సంఘ సేవకుడు జీలుబాయి ఆధ్వర్యంలో ముస్లింలు ఎవరైనా మృతి చెందింతే వారి అంత్యక్రియలకు అవసరమైన సామగ్రిని సేకరించి ఒకేచోట పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చి శభాష్ అనిపించుకుంటున్నారు.
– పలమనేరు
అన్ని వస్తువులు ఒకే కిట్లో..
సాధారణంగా ముస్లింలు మృతి చెందితే వారి అంత్యక్రియల నిర్వహణ కోసం కావాల్సిన వస్తువులు ఓచోట దొరకవు. దీంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి 12 రకాల వస్తువులను కొనాల్సి ఉంటుంది. దీనికితోడు అవసరాన్ని బట్టి వీటి ధరలు పెంచి అమ్ముతుంటారు. ఫలితంగా అంత్యక్రియలకు రూ.5 వేల నుంచి రూ.6 వేల దాకా సామగ్రికి వెచ్చించాల్సి ఉంటుంది. ఈ నగదు డబ్బున్నవారికి పెద్దగా కష్టం కాకపోవచ్చు. కాని పేదవారికి చాలా కష్టమైన పనే. దీన్ని గమనించిన జీలుబాయ్ బృందం కదిరి, మదనపల్లి, కర్ణాటకలోని కోలారు తదితర ప్రాంతాల నుంచి కర్రలు, ఈత చాప, రాళ్ల ఉప్పు, కొత్త బట్ట, అవసరమైన సెంట్లు తదితర 12 రకాల సామగ్రిని ఓ ప్యాక్గా చేసి అవసరమైన వారికి అందుబాటులోకి తెచ్చారు.
ఎవరైనా పోవాల్సిందే..
డబ్బులున్నవారు అంత్యక్రియలను చేయడం పెద్ద విషయం కాదు. అదే పేద ముస్లింలకు అంత్యక్రియల సామగ్రి కొనాలన్నా కష్టమే. దాంతో పాటు అవసరమైన అన్ని వస్తువులు ఒకేచోట దొరకవు. అందుకే అన్నింటిని కొని అవసరమైన వారికి అందుబాటులో స్థానిక ఖబరస్తాన్ సమీపంలోని మర్కజ్ కాంప్లెక్స్లో ఉంచాం. ఇందుకు సహకరించిన ముస్లిం మర్కజ్ జమాత్ పెద్దలు హామిద్, అజాం, సలాంబైతో పాటు ముస్లిం యువత మద్దతు మరువలేం. – జీలుబాయ్, పలమనేరు


