పలమనేరు: తెలుగుభాషకు పునర్ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్దప్రసాద్ పేర్కొన్నారు. మండలి వెంకటక్రిష్ణారావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పలమనేరులోని కళామందిరంలో శనివారం జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఇందుకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ...తెలుగుభాష మనుగడకు ప్రభుత్వ సహకారం, ప్రజల భాగస్వామ్యం, అధికారులు సమన్వయం అవసరమన్నారు. తెలుగుభాషా రక్షణకు ముఖ్యంగా గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుభాషా వికాసానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచంద్ వివరించారు. కార్యక్రమాన్ని తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసీనాథం నాయుడు, జాయినింగ్ దడాట్స్ నిర్వాహకులు ధనుంజయల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో ప్రముఖ రచయిత కట్టమంచి బాలక్రిష్ణారెడ్డి, పలమనేరు బాలాజీ, గంటా మోహన్, ధనుంజయ రామక్రిష్ణప్ప, మంచి కంటి వెంకటేశ్వర్రెడ్డి, పుష్ప, సిద్దార్థతో పాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణకు చెందిన పలువురు కవులు, రచయితలు, తెలుగు భాషాభిమానులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు.


