కార్వేటినగరం: కార్వేటినగరం మండలంలో విద్యుత్శాఖ అధికారుల నిర్వాహకం నిరుపేదల పాలిట శాపంగా మారింది. ఒంటరి మహిళ ఇంటికి ఏకంగా రూ.14వేలకుపైగా బిల్లు రావడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. పద్మసరస్సు గ్రామానికి చెందిన వెంకటమ్మ ఇంట్లో ఒంటరిగా నివశిస్తోంది. ఆమెకు పిల్లలు లేరు. ఫ్యాన్, ప్రిడ్జ్, ఏసీలాంటివేమీ లేవు. లైటు తప్ప ఇంకేమీ లేవు. అయినా ఆమెకు ఈనెల 21న వచ్చిన బిల్లు చూస్తే గుండె గుభేలు మంటోంది. ఏకంగా రూ.14,902 బిల్లు వచ్చింది. మొత్తం బకాయి మే 6వ తేదీలోపు చెల్లించాలని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్టు బాధితురాలు వాపోయారు. ఒక్క వెంకటమ్మ పరిస్థితే కాదు. గ్రామంలో ఏడుగురికి వేలల్లో విద్యుత్ బిల్లులు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.
మీడియా ముందు వాపోతున్న మహిళలు, అత్యధికంగా వచ్చిన విద్యుత్ బిల్లు
అదనపు బిల్లులు వసూలు
ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లు విద్యుత్ వాడితే అధనంగా వసూళ్లు చేస్తున్నాం. పై అధికారుల ఆదేశాల మేరకే విద్యుత్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను మిగిలిన యూనిట్లకు సంబంధించి కచ్చితంగా బకాయిలు చెల్లించాల్సిందే. – చంద్రబాబు, ఏడీఈ, కార్వేటినగరం


