కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దర్శనార్థం వచ్చిన ఓ నూతన వరుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును గురువారం ఆలయ సిబ్బంది తిరిగి అప్పగించారు. గొల్లపల్లి, దామలచెరువు ప్రాంతానికి చెందిన నూతన వరుడు భానుప్రకాష్ తన భార్యతో కలిసి స్వామివారి దర్శనానికి ఆలయానికి వచ్చాడు. ఈ క్రమంలో అతని మెడలో ఉన్న సుమారు 2 సవరాల బంగారు చైన్ ఆలయంలో జారిపోయింది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ వేణుకకు ఆ చైన్ కనిపించడంతో, వెంటనే ఆలయ ఏఈవో రవీంద్రబాబుకు అప్పగించారు. ఇదే సమయంలో, చైన్ పోగొట్టుకున్న భక్తుడు ఆలయ కార్యాలయాన్ని సంప్రదించగా, అధికారులు సీసీ కెమెరాలతో పరిశీలించి నిర్ధారించారు. ఆ తర్వాత ఆ బంగారు గొలుసును భానుప్రకాష్కు అందజేశారు. హోంగార్డ్స్ ఇన్చార్జ్ వినాయక తదితరులు పాల్గొన్నారు.
కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
పలమనేరు: పట్టణ సమీపంలోని నాగమంగళం వద్ద గురువారం చైన్నె– బెంగళూరు రహదారిపై స్కూటీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. గంగవరం మండలం, డండపల్లి కురప్పల్లికి చెందిన వీణ కుటుంబం పిల్లల చదువుల కోసం పలమనేరులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వీణ గురువారం పాఠశాల వద్దకు వెళ్లి పిల్లల ప్రోగ్రెస్ కార్డులు తీసుకుంది. అనంతరం తన పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంలో పట్టణంలోకి వస్తుండగా వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వీణ(30), ఆమె బిడ్డలు రుత్విక్(7), వాసవి(6) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు అదే కారులో ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడిన వారిని ఏరియా ఆస్పత్రిలో వదిలి కారు డ్రైవర్ పరారైనట్టు తెలిసింది. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ప్రమాదంలో గాయపడిన తల్లీబిడ్డలు


