● రూ.40 లక్షలతో విద్యార్థులకు భోజనశాల ఏర్పాటు ● ఉదారత చాటుకున్న వైఎస్సారసీపీ నేత రాజారెడ్డి కూటుంబం
యాదమరి: జన్మనిచ్చిన తల్లితండ్రులపై ఉన్న మమకారంతో రూ.40 లక్షల సొంత నిధులను వెచ్చించి విద్యార్థుల సౌకర్యార్థం భోజన శాలను నిర్మించి ఆదర్శంగా నిలిచారు... యాదమరి మండలం, పెరుమాళ్లపల్లికి చెందిన వైఎసార్సీపీ నాయకులు రాజశేఖర్రెడ్డి, అతని సోదరులు. గురువారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో దివంగత యశోదమ్మ, గోవిందరెడ్డి దంపతుల జ్ఞాపకార్థం నిర్మించిన భోజనశాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు ఎండలో పడుతున్న ఇబ్బందులను గుర్తించి తమ సొంత నిధులతో భోజనశాలను నిర్మించామన్నారు. విద్యార్థులతో కలసి భోజనం చేసిన అనంతరం భవనాన్ని ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. వ్యక్తిగత నిధులతో ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం పట్ల మండల విద్యాశాధికారులు, స్థానికులు అభినందించారు. అనంతరం వారిని ఉపాధ్యాయులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


