పంచగవ్యతో..
పంచగవ్య
నగరి : తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం, నేల ఆరోగ్య పరిరక్షణ, పంటల దిగుబడి పెరుగుదల, ఈ మూడు లక్ష్యాలను చేరుకోవడంలో పంచగవ్య కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో రైతులు సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,78,443 మంది సన్నకారు రైతులు, 1,11,676 మంది చిన్న రైతులు, 86,738 మంది ఇతర రైతులు ఉన్నారు. నగరి నియోజకవర్గంలో 7,704 మంది రైతులు ఉండగా 15,723 ఎకరాల పంటను సాగుచేస్తున్నారు. పంచగవ్య ప్రయోజనాలు తెలుసుకున్న రైతులు దానివైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వందకు పైగా రైతులు సుమారు 700 ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేస్తున్నారు. పంచగవ్య వినియోగం పెరిగితే, రైతులకు ఆర్థిక లాభం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణం కూడా అందుతుంది. సహజ వ్యవసాయానికి ఇది ఒక కొత్త దిశగా నిలుస్తుందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు.
గుండ్రాజుకుప్పంలో
పంచగవ్య వాడి సాగుచేసిన మామిడి తోట
పంచగవ్యను కలుపుతున్న రైతు సుబ్బరాజు
ఇంటి వద్దే పంచగవ్య తయారుచేసుకుంటున్న రైతు
తయారీ విధానం
దేశవాలి గోవులైన గిరిజాతి ఆవుల గోమయం, గోమూత్రం, పాలు, పెరుగు, నెయ్యి వంటి ప్రధాన పదార్థాలతో పాటు బెల్లం, తేనె, అరటి పండ్లు, గుమ్మడి గుజ్జు, అతిమధురం, వాయువిడంగాలు, ఖర్జూరం, కొబ్బరినీళ్లు, కొబ్బరి కల్లు వంటి పదార్థాలను నిర్దిష్ట పద్ధతిలో కలిపి పులియబెట్టి పంచగవ్య తయారు చేస్తారు.
ఎలా ఉపయోగించాలి?
ఎకరాకు 100 లీటర్ల నీటిలో 2–3 లీటర్ల పంచగవ్య కలిపి డ్రిప్ లేదా కాలువల ద్వారా అందించవచ్చు. లీటరు నీటికి 5 మి.లీ కలిపి పూత, కోత దశల్లో పిచికారీ చేయవచ్చు. విత్తన శుద్ధి కోసం పంచగవ్యలో విత్తనాలను 30 నిమిషాలు నానబెట్టడం ప్రయోజనకరం.


