– 8లో
– 8లో
న్యూస్రీల్
ఉచిత శిక్షణ.. ఉజ్వల భవిష్యత్తు
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో పనిచేయని ఆర్వో వాటర్ ప్లాంట్ గుడిపాల: చిత్తపార స్కూల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్
టీచర్ల డిక్లరేషన్లు అందజేయండి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల కేడర్ స్ట్రెంత్ జాబితాలను అందజేయాలని డీఈవో రాజేంద్రప్రసాద్ ఎంఈవోలను ఆదేశించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లా డుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపట్టిన టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియకు సంబంధించి సేకరించిన టిస్ (టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) డిక్లరేషన్ కాపీలను చిత్తూరు డీఈవో కార్యాలయానికి చేరవేయాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుని నుంచి ఇది వరకే సేకరించిన సంతకం చేసిన టిస్ డిక్లరేషన్ కాపీలను ఒక పూర్తి సెట్టు సిద్ధం చేయాలన్నారు. అన్ని డిక్లరేషన్ పత్రాలను కలిపి కాకుండా, హోదా వారిగా ప్రత్యేకంగా విభజించాలని సూచించారు. కేడర్ స్ట్రెంత్ వివరాలు అందజేసే సమయంలోనే డిక్లరేషన్ పత్రాలను సైతం ఇవ్వాలన్నారు.
నేడు కలెక్టరేట్లో
ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కా రం కోసం సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరుకావాలని, గైర్హాజరయ్యే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేడు గ్రీవెన్స్ డే
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్టౌన్ పక్కన్న ఉన్న ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు తనను నేరుగా కలిసి సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నేడు రాష్ట్ర ప్రచార విభాగ విస్తృత స్థాయి సమావేశం
విజయపురం (నగరి) : రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం జోన్–4లోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రచార కార్యదర్శి శేఖర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు, రామ్నగర్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి జోన్ 4 విభాగంలోని జిల్లా ప్రచార విభాగం అధ్యక్షులు, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రచార విభాగం కమిటీ సభ్యులు, నియోజకవర్గ, మండల ప్రచార విభాగం అధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొనాని ఆయన సూచించారు.
నేడు డయల్ యువర్ ఎస్ఈ
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉద యం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
.. ఇది ఒక్క చిత్తూరు, గుడిపాలలోనే కాదు.. జిల్లాల్లోని 90 శాతం పాఠశాలల్లో ఇదే దుస్థితి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీసం వాటి మరమ్మతులకు కూడా నిధులు విదల్చనంటోంది. ఫలితంగా విద్యార్థులు గుక్కెడు నీటి కోసం అల్లాడాల్సి వస్తోంది. దప్పికతోనే ఇంటికి కెళ్లి గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఇలాగే ఉంటే పిల్లలు అనేక రకాల రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలల్లో ఆర్వో వాటర్ల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు
చిత్తశుద్ధి లేదు
చిత్తూరు కలెక్టరేట్ : ‘పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి. నాణ్యమైన బోధన అందించాలి. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి..’ అన్న ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. నాడు–నేడులో భాగంగా సకల వసతులు కల్పించింది. సురక్షితమైన తాగునీరు అందించేందుకు లక్షల రూపాయలు వెచ్చించి ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. నిర్వహణను గాలికొదిలేసి మూలన పడేసింది. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఇళ్ల నుంచి వాటర్ బాటిళ్లలో తెచ్చుకున్న నీటితో అప్పుడప్పుడూ గొంతు తడుపుకోవాల్సి వస్తోంది. అసలే ఎండలు.. పిల్లలు సరిప డా నీరు తాగకపోతే అనేక రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరించడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.
నాడు స్వచ్ఛజలం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు విడతల్లో 1,953 ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అధునాతన ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సైతం విద్యార్థులకు స్వచ్ఛజలం అందించారు. ప్లాంట్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి నిర్వహణకు ప్రత్యేకంగా యాప్లను రూపొందించారు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా వెంటనే బాగు చేసేలా వ్యవస్థను తీసుకువచ్చారు. నేడు ఆ వ్యవస్థ అస్తవ్యస్తమైంది.
నేడు మరమ్మతులు శూన్యం
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఒక్క కొత్త ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. పోనీ ఉన్నవాటిని కాపాడుకోవడంలోనూ విఫలమయ్యారు. ఫిల్టర్లు పాడైపోయి, పైపులు పగిలిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నిర్వహణకు నిధులు లేకపోవడంతో హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు చేతులెత్తేశారు. జిల్లాలోని చిత్తూరు, కుప్పం, పలమనేరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాల్లో ఆర్వో యంత్రాలు మూలకు చేరి తుప్పుపడుతున్నాయి.
అభివృద్ధి అంటే ఇదేనా?
చంద్రబాబు ప్రభుత్వం విద్యారంగంపై విషం కక్కుతోంది. విద్యార్థులు నీటి సమస్యతో అలమటిస్తుంటే పట్టించుకోవాల్సిన సమగ్రశిక్ష శాఖ అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో పిల్లలకు స్కూల్లోనే మంచి నీళ్లు వచ్చేవి, ఇప్పుడు మళ్లీ పాతరోజులు వచ్చాయి అంటూ పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు : పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో మూలకు చేరిన ఆర్వో వాటర్ ప్లాంట్
గుడిపాల: పానాటూరు పాఠశాలలో మరమ్మతులకు గురైన ఆర్వో వాటర్ ప్లాంట్
చిత్తూరు : పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో పనిచేయని ఆర్వో వాటర్ ప్లాంట్
ప్రభుత్వ పాఠశాలల సమాచారం
నియోజకవర్గం పాఠశాలలు విద్యార్థుల
సంఖ్య
చిత్తూరు 183 11,413
గంగాధరనెల్లూరు 399 15,139
కుప్పం 433 31,955
నగరి 177 10,334
పలమనేరు 463 33,327
పుంగనూరు 404 22,856
పూతలపట్టు 355 15,642
మొత్తం 2,414 1,40,666
దాహం తీరేదెప్పుడు ?
గతంలో మా పాఠశాలలోనే చల్లటి మినరల్ వాటర్ తాగేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ ప్లాంట్ పనిచేయకుండా మూలకు చేరింది. మా పరిస్థితిని చూసి టీచర్లు సొంత డబ్బుతో బయట నుంచి తాగునీటి క్యాన్లు తెప్పిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో దాహం ఎక్కువగా వేస్తోంది. మా స్కూల్లో ఆర్వో ప్లాంట్ను వెంటనే రిపేర్ చేయించాలి.
– ఫనీష్, విద్యార్థి, గుడిపాల మండలం
బయట నుంచి తెప్పిస్తున్నారు
మా స్కూల్లో ఉండే ఆర్వో ప్లాంట్ మూలకు చేరింది. టీచర్లు బయట నుంచి రోజూ వాటర్ క్యాన్లు తెప్పిస్తున్నారు. గతంలో లాగా మాకు స్కూల్లోనే మంచి నీళ్లు వచ్చేలా చూడాలి. చాలా నెలలుగా ఆర్వో ప్లాంట్ చెడిపోయినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు ఆర్వో ప్లాంట్ను రిపేరు చేయించాలి.
– ప్రసన్నకుమార్, విద్యార్థి,
గుడిపాల మండలం
బాటిల్ నీరే దిక్కు
పేద విద్యార్థులు ఇంటి నుంచి నీటి సీసాలను తెచ్చుకుంటున్నారు. అవి అయిపోతే మధ్యాహ్నం తర్వాత ఇంటికెళ్లి నీరు తాగుతున్నారు. అంతవరకు దప్పికతోనే అలమటిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కష్టాలు చూడలేక టీచర్లు తమ సొంత జేబుల్లోంచి డబ్బులు వేసు కుని వాటర్ క్యాన్లును తెప్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 90 శాతం పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు మూలనపడ్డాయి. వీటి మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించలేదని హెచ్ ఎంలు చెబుతున్నారు. సరిపడా నీరు అందకపోవడంతో విద్యార్థులు డయేరియా, కడుపునొప్పితో అల్లాడిపోతున్నారు.
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు
పాఠశాలలో శుద్ధ జలం యంత్రం మరమ్మతులకు గురికావడంతో మా కుమార్తె ఇంటి నుంచి వాటర్ బాటిళ్లు తీసుకెళ్తుంది. వేసవిలో సరిపడా నీరు తాగకుంటే వడదెబ్బ బారినపడే అవకాశం ఉంది. కనీసం పాఠశాలలో చేతి బోరు కూడా లేదు. విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని తాగించేందుకు, రోగాల బారిన పడకుండా రక్షించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి. – పద్మ, విద్యార్థినితల్లి,
ఎగువ చవటపల్లె, తవణంపల్లె మండలం


