బైరెడ్డిపల్లె: విద్యుత్ స్తంభం నుంచి కింద పడి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మూలతిమ్మేపల్లె విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మూలతిమ్మేపల్లె విద్యుత్ సబ్ స్టేషన కార్యాలయంలో ఆపరేటర్గా పనిచేస్తున్న రమణ ఆదివారం విద్యుత్ మరమ్మతులు చేయడానికి స్తంభం పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు గాయపడటంతో ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ట్రాన్స్కో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
గ్రానైట్ లారీ స్వాధీనం
పెనుమూరు(కార్వేటినగరం): అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నట్లు పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మండలంలోని శాతంబాకం వద్ద వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. పెద్ద గ్రానైట్ దిమ్మెను తీసుకుని వస్తున్న లారీని ఆపి తనిఖీ చేసినట్టు తెలిపారు. గ్రానైట్ను వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం నుంచి యాదమరి మండలంలోకి తీసుకెళుతున్నట్టు డ్రైవర్ తెలిపాడన్నారు. మైన్స్ అండ్ జియాలజీ అధికారుల అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం లారీని మైన్స్ అండ్ జియాలజీ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు.


