చిత్తూరు కలెక్టరేట్: ఇంటర్ సెకండియర్లోనూ ఇంప్రూవ్మెంట్కు అవకాశం కల్పించినట్టు ఇంటర్ డీఐఈవో రఘుపతి తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ 2026 మార్చి పరీక్షల్లో రెండో ఏడాది పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ప్రథమ సంవత్సరం తరహాలో ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చన్నారు. విద్యార్థులు రాసిన పేపర్లలో ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే తుది ఫలితాల్లో పరిగణలోకి తీసుకుంటారన్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షల్లో పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులు ఉత్తీర్ణులైన సబ్జెక్టుల్లో ఇంప్రూవ్మెంట్ రాసేందుకు అర్హులన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం లేదన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు తాము పాస్ అయ్యే వరకు ఎన్ని సబ్జెక్టులకై నా పరిమితి లేకుండా హాజరుకావచ్చన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి రూ.600, రెండు సంవత్సరాలకు కలిపి హాజరయ్యేవారు రూ.1200 చెల్లించాలన్నారు. పరీక్ష ఫీజుతో పాటు ఇంప్రూవ్మెంట్ రాసే ప్రతి సబ్జెక్టుకూ అదనంగా రూ.160 చెల్లించాలని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 27 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు ఉపయోగించిన పాత రిజిస్ట్రేషన్ నంబర్తోనే దరఖాస్తు చేసుకోవాలని డీఐఈవో తెలిపారు.


