పలమనేరు: పలమనేరు పట్టణంలో బుల్లెట్ ట్రైన్ ఆగేదాకా ఉద్యమం ఆపబోమని స్థానిక పలమనేరు పరిరక్షణ సమితి(పీపీఎస్) నిర్వాహకులు హెచ్చరించారు. వారు శుక్రవారం పలమనేరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పీపీఎస్ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ పలమనేరు ప్రాంతానికి చెందిన వేలాదిమంది బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారు ప్రతిరోజూ వివిధ వాహనాల్లో వ్యయప్రయాసలు పడుతూ బెంగళూరు వెళుతున్నారని తెలిపారు. పలమనేరులో బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ పెడితే ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. అలాగే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, చైన్నె–మైసూరు బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ పలమనేరులో పెట్టాలన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామని తెలిపారు. కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు, ప్రజాసంఘాలు, కులసంఘాల ప్రతినిధులు, ఏపీ ఎన్జీవోలు పాల్గొన్నారు.


