చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని తవణంపల్లి మండలంలో భూ వివాదం దౌర్జన్యానికి దారితీసింది. సర్వే నంబర్ల సాక్షిగా ఉన్న అస్తులను కొందరు వ్యక్తులు అడ్డగోలుగా కూల్చివేశారు. ఈ సమస్యను బాధితుడు కృష్ణమూర్తినాయుడు శుక్రవారం ఆర్డీవో శ్రీనివాసులుకు విన్నవించుకుని కన్నీరు మున్నీరయ్యారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తవణంపల్లి తహసీల్దార్ అండదండలతోనే అక్రమాలు జరిగాయన్నారు. తనకు తవణంపల్లి మండలం ఎం.కృష్ణాపురం గ్రామంలో సర్వే నం.78/2,77/2,60/2లో మామిడి తోపు ఉందన్నారు. ఈ తోపు చుట్టూ రక్షణగా రాతి కూసాలతో కంచెను, ప్రధాన గేటును ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. తోటలోనే ఒక ఇల్లు, కసువు పందిరి ఉందన్నారు. సతీష్నాయుడు, మధుసూదన్నాయుడు అనే వ్యక్తులు మరికొందరితో కలిసి కంచె, ఇళ్లును దౌర్జన్యంగా కూల్చివేశారన్నారు. సెటిల్మెంట్ స్థలంలో ఉన్న తమ ఆస్తులను కూల్చే హక్కు ఎవరికీ లేదన్నారు. కంచెతో పాటు ఏళ్లనాటి చింతమానులను సైతం నేలమట్టం చేశారన్నారు. దీని వెనుక తవణంపల్లి తహసీల్దార్ ప్రోద్భలం ఉందన్నారు. దౌర్జాన్యానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


