చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఈ నెల 6న ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ బుధవారం ముగిసింది. ఈ ప్రక్రియను అబ్జర్వర్ మువ్వా రామలింగం, డీఈవో రాజేంద్రప్రసాద్ పకడ్బందీగా పర్యవేక్షించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆయా సబ్జెక్టులకు సంబంధించి 1,73,984 జవాబుపత్రాలను టీచర్లు దిద్ది మార్కులను నమోదు చేశారు. ఈ విధుల్లో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 749 మంది వివిధ కేడర్ టీచర్లు పాల్గొన్నారు. మార్కుల నమోదుకోసం కేటాయించిన పాత ట్యాబ్లు మొరాయించడంతో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సర్వర్ నెమ్మదించడం, ట్యాబ్లు తరచూ అప్లోడింగ్లో హ్యాంగ్ కావడం, మార్కుల అప్లోడింగ్లో జాప్యం తదితర సమస్యల వల్ల విధుల్లో కొంత ఆలస్యం జరిగినప్పటికీ టీచర్లు అదనపు సమయం కేటాయించి ప్రక్రియను పూర్తి చేశారు. ఇక అందరి దృష్టి ఫలితాలపై పడింది. జవాబుపత్రాల స్కానింగ్, మార్కుల క్రోడీకరణ ప్రక్రియ ముగిసిన వెంటనే సాధ్యమైనంత త్వరగా ఫలితాలను వెల్లడించేలా కసరత్తు చేస్తున్నారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా డేటా ఎంట్రీని డబుల్ చెక్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


