కుప్పం: రామకుప్పం గురుకుల పాఠశాలను మెగా ఇంజినీరింగ్ ఆన్ ఇన్ప్రాస్ట్రక్చర్ సంస్థ దత్తత తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా రామకుప్పం గురుకుల పాఠశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గురుకుల పాఠశాల అభివృద్ధి చేసేందుకు ఇంజినీరింగ్ సంస్థ ముందుకు రావడం హర్షణీయమన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సమగ్ర వికాసం కోసం మెగా సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. అనంతరం మెగా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంజీవీకే.భాను మాట్లాడారు. గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, వారి ఆలోచనల దృక్ఫదాన్ని మార్చి క్రమశిక్షణతో కూడిన విద్యనందించడమే లక్ష్యంగా ఇంజినీరింగ్ సంస్థ పనిచేస్తుందన్నారు. విద్యార్థులను సమాజంలో ఉన్నత స్థాయికి చేర్చేలా వారిని మానసికంగా సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ దుర్గమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, కడా పీడీ వికాస్ మర్మత్ తదితరులు పాల్గొన్నారు.


