నగరి : నగరి నియోజకవర్గంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన కొండచుట్టు మండపం రక్షణకు మరో కీలక ముందడుగు పడింది. జాతీయ రహదారి 716 విస్తరణ పనుల్లో భాగంగా ఏళ్ల నాటి ప్రాచీన మండపం కూల్చివేతకు గురికాకుండా చూడా లని మాజీ మంత్రి ఆర్కే రోజా ముందు కు వచ్చి పోరాటం సాగిస్తున్న విషయం విధితమే. ఇదివరకు ఆమె కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీలు గురుమూర్తి, మిథున్రెడ్డితో వెళ్లి వినతి పత్రం సమర్పించగా, ఆ అంశంపై స్పందన లభించింది. 10 నుంచి 16వ శతాబ్ద కాలంలో నిర్మించిన కొండచుట్టు మండపం వద్ద రోడ్డు రీ–అలైన్మెంట్ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని చర్చిస్తామని గడ్కరీ నుంచి ఎంపీకి లేఖ రావడం గమనార్హం. దీంతో మండపం రక్షణపై ఆశలు మరింత బలపడ్డాయి. ఈ పరిణామం నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా చేస్తున్న ప్రయత్నాలకు ప్రజ ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నాయకులు, స్థానికులు ఆమె కృషిని అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొండచుట్టు మండపం నగరి ప్రజల ఆధ్యాత్మిక భావోద్వేగాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అక్కడ 21 మంది దేవతలు కొలువుదీరిన పవిత్ర స్థలమని, అందుకే ఆ చారిత్రక కట్టడాన్ని కాపాడాలని తాను పోరాటం చేస్తున్నానన్నారు. దేవదేవతల ఆశీస్సులతో ఈ ప్రయత్నం విజయవంతమవుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తంగా, కొండచుట్టు మండపం పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమం మరో దశకు చేరుకోగా, రాబోయే రోజుల్లో దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


