ఎస్వీయూలో రూసా లక్ష్యం పక్కదారి
నిధులు దుర్వినియోగంపై విద్యార్థి
సంఘాల ఆగ్రహం
అవినీతి జరిగిందంటూ విమర్శల వెల్లువ
శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
తిరుపతి సిటీ: యూనివర్సిటీల్లో పరిశోధనల సామర్థం పెంపు, విద్యార్థుల్లో సాంకేతికత మెరుగు, డిజిటల్ ప్రాజెక్టులు, అధునాతన సాంకేతక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకం కింద రాష్ట్రంలో అర్హత కలిగిన వర్సిటీలను ఎంపిక చేసి, పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా ఎస్వీయూకు రెండు విడతలుగా రూ.21 కోట్లు, రూ.100 కోట్లు మంజూరు చేసింది. విద్యార్థుల్లో ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి వర్సిటీలో ఏకంగా రూసా ఇన్నోవేషన్ హబ్ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన నిధులు పక్కదారి పడుతున్నాయని, కొందరు అధికారులు తమ స్వార్థం కోసం అవినీతికి పాల్పడుతూ దుర్వినియోగం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూసా నిధులపై తక్షణం వర్సిటీ అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలని, వర్సిటీ అభివృద్ధికి, నూతన పరిశోధనల కోసం వెచ్చించిన నిధులకు లెక్క చెప్పాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఎస్వీయూలో రూసా పథకం.. అవినీతి, అక్రమాలకు అడ్డా మారింది. కేంద్ర ప్రభుత్వ నిధులు నొక్కేయడానికి కొందరికి ఈ పథకం కల్పతరువుగా మారింది.. విద్యార్థులు, వర్సిటీ అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులు అక్రమార్కుల అవతారమెత్తిన సిబ్బంది జేబుల్లోకి వెళ్లింది.. అధికారులు మగత నిద్ర.. కొరవడిన పర్యవేక్షణ.. నిర్లక్ష్యం కారణంగానే నిధులు దుర్వినియోగం జరిగింది.. అద్యాపకుల అడ్డగోలు మేతతో విద్యార్థుల్లో నైపుణ్యాలు.. వర్సిటీ అభివృద్ధి కుంటుపడింది.
రూసా స్వాహా!


