చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పథకాలకు దిక్సూచి జనగణన అని డీఆర్వో మోహన్కుమార్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ భవిష్యత్ను, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను నిర్ణయించే జనగణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈనెల 27న ప్రారంభమైన మొదటి విడత శిక్షణలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రక్రియపై రెండు బ్యాచ్లుగా ట్రైనర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ఈ ప్రక్రియ సమగ్రతను గుర్తించాలన్నారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన మౌలిక, సామాజిక వివరాలను పక్కాగా సేకరిస్తేనే భవిష్యత్లో ప్రభుత్వ పథకాల రూపకల్పన జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన ట్రైనర్లు తమ మండలాలకు వెళ్లి ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు ఇదే నాణ్యతతో శిక్షణ ఇచ్చి, సమాచార సేకరణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాలన్నారు. మాస్టర్ ట్రైనర్ డాక్టర్ హేమలత, డైట్ కళాశాల ప్రతినిధి మునిచంద్ర, ఇతర ట్రైనర్లు పాల్గొన్నారు.


