–10 కేసుల పరిశీలన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో నమోదైన శిశు మరణాలపై వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మార్చిలో చోటుచేసుకున్న పది శిశు మరణాలపై జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమీక్ష నిర్వహించింది. చిత్తూరులోని జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం డీఐఓ హనుమంతరావు ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బందితో సమావేశం జరిగింది. గర్భిణులకు గర్భధారణ ప్రారంభం నుంచి శిశువు రెండేళ్ల వయస్సు వరకు 1000 రోజుల ప్రత్యేక సంరక్షణ అవసరమని అధికారులు పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రత్యేక వైద్య సేవలందించాలని, అవసరమైతే ఉన్నత ఆస్పత్రులకు రెఫర్ చేయాలని సూచించారు. ప్రతి గర్భిణి కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. బాల్య వివాహాలు నివారించడం, టీనేజ్ గర్భధారణపై నిఘా పెంచడం అవసరమని పేర్కొన్నారు. ప్రతి నెలా 9వ తేదీన పీహెచ్సీలలో నిర్వహించే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. గుండె జబ్బులు, థైరాయిడ్, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్న గర్భిణులకు ప్రత్యేక చికిత్స అందించాలని, తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు వెంటనే వైద్య సేవలందించాలని తెలిపారు.


