వరుస ప్రమాదాలతో రవాణాశాఖ అలర్ట్ కర్నూలు, అరకు, చిత్తూరు, గంగసాగరం తర్వాత మార్కాపురంలో మరో ప్రమాదం ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగే ప్రధాన కారణం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు ఆగడం లేదు. ఇటీవలి కాలంలో కర్నూలు, అర కు, చిత్తూరు జిల్లా గంగసాగరం ప్రాంతాల్లో జరిగిన ఘటనలు మరువకముందే మార్కాపురం వద్ద మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ వరుస ఘటన లు ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. రాత్రి ప్రయాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
చిత్తూరు జిల్లా కేంద్రం మీదుగా విజయవాడ, నెల్లూరు, తిరుపతి నుంచి బెంగళూరు, అలాగే తమిళనాడు నుంచి తిరుపతికి 800కుపైగా ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రయాణంలో అంత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. బంగారుపాళ్యంలోని మొగిలి, చిత్తూరు–వేలూరు రోడ్డు, పూతలపట్టు–తిరుపతి మార్గం, కాణిపాకం బైపాస్, పుత్తూరు రోడ్డు, నగరి రోడ్డు ఇలా పలు మార్గాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ మార్గాల్లో ప్రమాదా లు జరగకుండా రవాణాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. బస్సులను నిత్యం తనిఖీలు చేయిస్తున్నారు. అయినా ప్రాథమికంగా వెలుగులోకి వస్తున్న అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధిక వేగం, డ్రైవర్ల అలసట, నిర్లక్ష్య డ్రైవింగ్, వాహనాల్లో లోపాల వల్ల ఎక్కడో ఓ చోట ప్రమాదాలకు దారితీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ బస్సుల వాస్తవ పరిస్థితి అనుమానాస్పదంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రంగంలోకి రవాణాశాఖ
మార్కాపురం ప్రమాదాల పరంపర నేపథ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. చెక్పోస్టులు, హైవేలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ల లైసెన్సులు, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్, ఇన్సూ రెన్స్ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఓవర్లోడింగ్, ఓవర్ స్పీడ్పై ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తీవ్ర లోపాలు ఉన్న వాహనాలను సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే అనుమతులను రద్దు చేసే చర్యలకూ వెనుకాడబోమని అంటున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్పై పెరుగుతున్న అనుమానాలు
భద్రతే లక్ష్యం
ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో క్రమశిక్షణ తీసుకురావడమే ఈ తనిఖీల లక్ష్యమని పేర్కొంటున్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బస్సు పరిస్థితిని గమనించడం, అధిక వేగంపై అభ్యంతరం చెప్పడం అవసరమని చెబుతున్నారు.


