చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లా స్థాయి చెస్ ఎంపికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నట్టు ఏపీ చెస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.ఆర్.బీ ప్రసాద్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆల్ చిత్తూరు చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న జిల్లా స్థాయి అండర్–07, అండర్–09 ఓపెన్–గర్ల్స్ చెస్ చాంపియషిప్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 29న చిత్తూరు జిల్లా కేంద్రంలోని స్కూల్ ఆఫ్ చెస్ కార్యాలయంలో ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఉదయం 8.15 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. అండర్ 07 పోటీలకు 1–1–2019 తర్వాత, అండర్ 09కి 01–1–2017 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. పోటీలకు వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా తమ వెంట సొంత చెస్ బోర్డు, చెస్ క్లాక్, పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రం తీసుకురావాలన్నారు. ప్రతి కేటగిరీ నుంచి ప్రతిభ కనబరచిన మొదటి ఇద్దరు క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అండర్ 07 విజేతలకు ఏప్రిల్ 4న ద్వారకా తిరుమలలో, అండర్ 09 విజేతలకు ఏప్రిల్ 18న అన్నవరంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9849313676, 900475799 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు దినేష్, గిరిధర్, గజేంద్ర, అశోక్ పాల్గొన్నారు.


