చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 71 సమస్యలు, ఎల్టీ లైన్ల పరంగా 97, సర్వీసు లైన్ పరంగా 03 కలిపి మొత్తం 171 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. అందులో 9 సమస్యలను పరిష్కరించామన్నారు. మిగిలినవి ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని పరిష్కరించనున్నట్లు వివరించారు.
పీసీఆర్ పాఠశాలలో
జేడీ తనిఖీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలను జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో చేపట్టాల్సిన మరమ్మతు పనులపై ఆయన ఆరా తీశారు. జేడీ మాట్లాడుతూ భవనం వారసత్వ సంపద దెబ్బతినకుండా, ఆధునిక సాంకేతికతతో పనులు చేపట్టాలన్నారు. గోడల పటిష్టత, పైకప్పు లీకేజీ నివారణ చర్యలపై ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల కోడింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. డీఈఓ రాజేంద్రప్రసాద్, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ జయప్రకాష్నాయుడు, డీసీఈబీ సెక్రెటరీ హేమాద్రి, ఎంఈఓ పాండ్యన్, హెచ్ఎం పూర్వాణి, పీడీ దేవా తదితర అధికారులు పాల్గొన్నారు.
4 నుంచి ‘మై సైన్స్ గ్యారేజ్’
తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఏప్రిల్ 4 నుంచి ఏడాది పొడవునా మై సైన్స్ గ్యారేజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ మేరకు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ కె.శ్రీనివాస నెహ్రూ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ 3, 4, 5వ తరగతి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పిల్లలే స్వయంగా ప్రయోగాలు చేసేలా, విభిన్న వస్తువులు రూపొందించేలా సైన్స్లోని మూల సూత్రాలను అనుభవపూర్వకంగా నేర్చుకునేలా ఈ గ్యారేజ్ను నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతి నెలా మొదటి ఆదివారం మై సైన్స్ గ్యారేజ్ నిర్వహించనున్నామని, దీనికి సంబంధించిన మెటీరియల్ను సైన్స్ సెంటర్ అందిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు విద్యార్థులకు రూ.2వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


