తిరుపతి మంగళం : పులికాట్ సరస్సు పరిధిలోని సుమారు 20వేల మంది మత్స్యకారుల భద్రతను కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు పార్లమెంట్లో మత్స్యకారుల సమస్యలను ప్రస్తావించారు. ఎంపీ మాట్లాడుతూ రిజర్వ్ చేసిన మత్స్యకార ప్రాంతాల్లో పెద్ద యాంత్రిక పడవలతో పొరుగు రాష్ట్రాల జాలర్లు అక్రమంగా చొరబడి వలలు, పడవలకు నష్టం కలిగించడమే కాకుండా, దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధికి, శాంతి భద్రతలకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పులికాట్ ముఖద్వారం వద్ద పూడికతీత, మత్స్యకారుల అక్రమ చొరబాట్ల నిరోధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాంతీయ మత్స్యకార నిర్వహణ మండళ్లు ఏర్పాటు చేస్తే సమస్యల తీరిపోదని స్పష్టం చేశారు. తీరంలో కట్టుదిట్టంగా గస్తీ పెట్టాలని, అక్రమంగా చొరబడిన మర పడవలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకుని శాశ్వత అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 81,483 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,777 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


