– మూడు రోజుల్లోనే నిందితుడి అరెస్ట్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అప్పు వివాదం యువకుడి ప్రాణాలు తీసింది. ఈ కేసును పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. వివరాలు.. ఇటీవల చిత్తూరు మండలం, తుమ్మిందపాళెం గ్రామానికి చెందిన కె.సాయికుమార్ను అదే గ్రామానికి చెందిన కె.ఢిల్లీబాబు నాటు తుపాకీతో కాల్చి హత్య చేసిన ఘటన కలకలం సృష్టి్ంచింది. ఈమేరకు నిందుతుడిని శుక్రవారం చిత్తూరు నగరంలోని తాలూకా పోలీస్ స్టేషన్లో సీఐ రామచంద్ర అరెస్ట్ చూపించి.. వివరాలను వెల్లడించారు. చిత్తూరు మండలంచ తుమ్మింద గ్రామానికి చెందిన సాయికుమార్ (25) వద్ద కొద్ది రోజుల క్రితం ఢిల్లీబాబు రూ.2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులను తిరిగి ఇవ్వాలని సాయికుమార్ కుటుంబ సభ్యులు పలుమార్లు అడిగినా ఢిల్లీబాబు నిరాకరించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం డబ్బులు తిరిగి ఇవ్వాలని ఢిల్లీబాబును సాయికుమార్ కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ఢిల్లీబాబు ముందే సిద్ధం చేసుకున్న నాటు తుపాకీతో సాయికుమార్ తలపై కాల్చాడు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు తుపాకీతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్న్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు–వేలూరు రోడ్డులోని గోపాలపురం బస్టాప్ వద్ద నిందితుడు ఢిల్లీబాబును అదుపులోకి తీసుకున్నారు. అతని ఒప్పంద వాంగ్మూలం మేరకు హత్యకు ఉపయోగించిన నాటు తుపాకీతో పాటు నల్లమందు రవ్వలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐలు అశోక్కుమార్, వెంకటనారాయణ తదితరులున్నారు.


