పలమనేరు : మండలంలోని కొలమాసనపల్లె వద్ద భూమి ఆగ్రో బయో ఫ్యూచర్ లిమిటెడ్ ఎరువుల తయారీ కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి మురళి మంగళవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ బయో ఎరువుల పేరిట రైతులను పలువులు మోసం చేస్తున్న నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా బయో ఎరువులను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల తయారీకి వినియోగించే ముడి సరుకులను పరీక్షకు పంపించి ఫలితాలు వచ్చిన తర్వాతే ఉత్పత్తి మొదలుపెట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఉత్పత్తి చేసిన ఎరువులకు అనుమతులు వచ్చాకే మార్కెట్కు తరలించాలని స్పష్టం చేశారు. అప్పటి వరకు రైతులకు విక్రయిస్తే సహించే ప్రసక్తే లేదని వెల్లడించారు.


