నీ రుణం తీర్చుకుంటాం!
పూతలపట్టు(యాదమరి): చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకోవాలనే తపనతో హైదరాబాద్లో స్థిరపడ్డ పాపారాజుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు డా.హరినాథ్రెడ్డి ఉదారతను చాటుకున్నారు. సోమవారం మండల పరిధి పి.కొత్తకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు రూ.పది లక్షలతో నిర్మించిన అధునాతన ఇండోర్ వేదికను తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఇటీవల పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులు సరైన వసతులు లేక ఇబ్బంది పడడం చూసి ఆయన వెంటనే ఈ నిర్మాణానికి పూనుకున్నారు. స్థానిక మాజీ ఎంపీటీసీ, వైఎస్సార్సీపీ నాయకులు ప్రభాకర్రెడ్డి సహకారంతో పది రోజుల్లోనే నిర్మాణాన్ని పూర్తిచేయించారు. ఈ సందర్భంగా డా.హరినాథ్రెడ్డి మాట్లాడుతూ తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను, జన్మనిచ్చిన ఊరిని మరవరాదని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఆయన సతీమణి పుష్పతో కలసి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. దాత కుమార్తె సౌమ్య, పూతలపట్టు నియోజకవర్గ వైఎస్సార్సీపీ మేధావుల కమిటీ అధ్యక్షుడు రాజారత్నం రెడ్డి, సర్పంచ్ పద్మజారాణి, పార్టీ నాయకులు సుధాకర్రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, ఉమారెడ్డి, సురేంద్రనాయుడు, ఎంఈఓలు పాల్గొన్నారు.


