నేనేం సమాధానం చెప్పేది సామీ?
కార్వేటినగరం: ‘అనారోగ్యంతో బాధపడుతున్న మీ తండ్రికి, భర్తకు దూరంగా ఉంటున్న మీ అమ్మకి ఏం సమాధానం చెప్పాలి..?.. డాడీ డాడీ అంటూ నీ చుట్టూరే తిరిగే పిల్లలకు మా నాన్న ఎక్కడ అని అడిగితే ఏమని చెప్పేది దేవుడా..?’ అంటూ తన భర్త మృతదేహంపై పడి ఓ ఇల్లాలు హృదయ విదారకంగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఈ ఘటన కార్వేటినగరంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. తిరుపతి రూరల్ మండలం, ముళ్లపూడి గ్రామానికి చెందిన ఎస్.నాగరాజుకుమారుడు ఎస్.శంకర్(34) అదే మండలం, పద్మావతిపురం పంచాయతీ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తు న్నాడు. అతనికి కార్వేటినగరానికి చెందిన ఉషాతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. అతను భార్యాపిల్లతో పాటు కార్వేటినగరంలోనే నివసిస్తు న్నాడు. సోమవారం ఉద్యోగ రీత్యా పద్మావతిపురంలోని పంచాయతీ కార్యాలయానికి వెళ్లి అత్యవసరపని నిమిత్తం తిరిగి కార్వేటినగరానికి బయల్దేరాడు. పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు వెళ్తున్న బొలేరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొనడంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వారికి దిక్కెవరు దేవుడా?
అనారోగ్యంతో బాధపడుతున్న మీ దండ్రికి, దూరంగా ఉంటున్న కన్న తల్లికి నేను ఏమి సమాధానం చెప్పేది..? అంటూ మృతుడు శంకర్ భార్య ఉషా భర్త మృతదేహం వద్ద బోరున విలపించడం కలచివేసింది. బిడ్డలను ఎలా పోషించేదంటూ.. ఆమె గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. నిద్ర లేచినప్పటి నుంచి పిల్లలు ఇద్దరూ డాడీడాడీ అంటూ నీ చుట్టూరే తిరిగేవారే.. వాళ్లిప్పుడు మా డాడీ ఎక్కడ..? అని అడిగితే వారికి ఏమి సమాధానం చెప్పేదని బోరున విలపించారు. నువ్వు నిత్యం పూజలు చేసే దేవతలు కూడా కాపాడలేక పోయారా..?. ఆలయాల్లో జరిగే కార్యక్రమాలకు అడిగిన వెంటనే వేల రూపాయలు దానం చేసే నిన్ను దేవతలు కూడా రక్షించలేక పోయారా స్వామీ.. అంటూ భర్త మృత దేహంపై పడి విలపించిన తీరు అక్కడి వారి గుండెల్ని పిండేసింది.
నేనేం సమాధానం చెప్పేది సామీ?


