
రేపు చంద్రగహణం
కాణిపాకం: చంద్రగ్రహణ కారణంగా కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని ఆదివారం రాత్రి మూసివేయనున్నట్టు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. గ్రహణం రాత్రి 9.57 నుంచి మరసటి రోజు వేకువజామున 1.26 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఇదే సమయానికి ప్రధాన ఆలయంతో పాటు మణికంఠేశ్వరస్వామి ఆలయం, శ్రీవరదరాజులస్వామి ఆలయాలను కూడా మూసివేస్తామన్నారు. సోమవారం ఉదయం 4 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, గ్రహణశాంతి, అభిషేకం అనంతరం ఉదయం 6 గంటలకు భక్తుల దర్శన సేవ ప్రారంభమవుతుందన్నారు.
ఎంపీడీఓలుగా పదోన్నతి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో పలువురు డిప్యూటీ ఎంపీడీఓ, ఏఓలకు ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన వారిలో 22 మందిని ఉమ్మడి జిల్లాకు కేటాయించారు. త్వరలో వీరికి జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు మండలాలను కేటాయించనున్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి అప్పాజి, ప్రసాద్, మనోహర్గౌడ్, పీ.వీరేంద్ర, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లురావ్, పీ.శ్యామ్, వాసుదేవరావ్, కడప నుంచి చంద్రశేఖర్రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి చంద్రశేఖర్రెడ్డి, రాధారాణి, వనజ, వాణి, రవిచంద్ర, తిరుపతి జిల్లా నుంచి శ్రీదేవి, ఉమమహేశ్వరరావ్, విజయమ్మ, రవీంద్రబాబు, అన్నమయ్య జిల్లా నుంచి శ్రీధర్రావ్, బాపూజీపట్నాయక్, సఖుర్, లతీఫ్ఖాన్కు పదోన్నతలు లభించాయి.
ఎరువుల సరఫరాలో
లోపాలుంటే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఎరువుల సరఫరాలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని కలెక్టర్ సుమిత్ కుమార్గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న సొసైటీలకు వెంటనే యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలన్నారు. ఎరువుల పంపిణీ ప్రక్రియలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలు, రానున్న వారానికి అవసరమైన ఎరువుల వివరాలను మండల వ్యవసాయశాఖాధికారులు నివేదికలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో అర్హులకు ఎరువుల సరఫరా పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఎక్కడైనా అధిక మోతాదులో పంపిణీ చేసిన ఘటనలను గుర్తిస్తే వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదికలు అందజేయాలన్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద పెద్ద మొత్తంలో యూరియా నిల్వలు లేకుండా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. డీలర్ల వద్ద ఉన్న ఎరువులను అవసరమైన రైతులకు పకడ్బందీగా అందజేయాలన్నారు.
చౌడేపల్లె: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈనెల 7న ఆదివారం బోయకొండ గంగమ్మ ఆలయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు మూసి వేయనున్నట్టు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. గ్రహణం అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసి సోమవారం నిత్య కైంకర్యాలతోపాటు అమ్మవా రికి గ్రహణ దోష పూజలు నిర్వహిస్తామన్నారు.
కార్వేటినగరం: పాక్షిక చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ ఆదివారం కార్వేటినగరం శ్రీవేణుగోపాల స్వామివారి ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు టీటీడీ ఆలయ అధికారి సురేష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజు రాత్రి 9.56 నుంచి అర్ధరాత్రి 1.26 గంటల వరకు గ్రహణ కాలంగా ఉంటుందన్నారు. చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీవేణుగోపాలస్వామి ఆలయ తలుపులు మూసివేస్తారని వివరించారు. ఎనిమిదో తేదీ సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటలకు యథావిధిగా దర్శనానికి అనుమతించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు గమనించాలన్నారు.