కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఐటీ ఉద్యోగులు రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోంకే పరిమితమైన విషయం తెలిసిందే. ఇక కరోనా ఉదృతి తగ్గడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్దమయ్యాయి. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్ వర్క్ను అనుసరిస్తోన్న, మరి కొన్ని కంపెనీలు కచ్చితంగా ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందేంటూ ఆల్టిమేటం జారీ చేశాయి. కాగా వర్క్ ఫ్రం ఆఫీస్పై ఐటీ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తగ్గేదేలే..రాజీనామాకైనా సిద్దం..!
రెండేళ్ల తరువాత ఐటీ కంపెనీలు ఆఫీసులను ఒపెన్ చేస్తోన్న నేపథ్యంలో ...ఉద్యోగులు అధిక శాతం వర్క్ ఫ్రం హోంకు సిద్దంగా ఉన్నట్లు రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సంస్థ CIEL HR సర్వీసెస్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వే పలు ఆసక్తికర విషయాలను బహిర్గతం చేసింది. వర్క్ ఫ్రం హోం ఎంతో సౌకర్యవంతంగా ఉందని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఒక వేళ ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఆఫీసులకు రావాలనే నిబంధనను కచ్చితం చేస్తే..కంపెనీలకు రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న ఉద్యోగులు వెల్లడించారు. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతి పది మంది ఉద్యోగుల్లో కనీసం 6 గురు రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
హైకులు..ప్రమోషన్స్ అవసరం లేదు..!
ఐటీ, ఔట్ సోర్సింగ్, టెక్ స్టార్టప్స్,, కన్సల్టింగ్, బీఎఫ్ఎస్ఐ వంటి అన్ని రంగాల్లోని ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయడానికి సిద్దంగా ఉన్నారని సర్వే తెలిపింది. అంతేకాకుండా వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తే.. హైకులు, ప్రమోషన్స్ కూడా అవసరం లేదని ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఈ సర్వేలో సుమారు 620 కంపెనీల నుంచి దాదాపు 2,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కంపెనీల్లో సుమారు 40 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. 26 శాతం మంది హైబ్రిడ్ మోడ్లో ఉండగా...మిగిలిన వారు ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు.
రిమోట్ వర్కింగ్కు ఛాన్స్..!
వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ వైపు ఉద్యోగులు మొగ్గు చూపుతున్నందున... రిమోట్ వర్కింగ్ను ప్రారంభించిన చాలా కంపెనీలు కనీసం ఒక ఎంపికగానైనా కొనసాగించాలని యోచిస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో టాటా స్టీల్ ఒకటి. కోవిడ్-19 సమయంలో 'ఎజైల్ వర్కింగ్ మోడల్స్' విధానాన్ని ప్రకటించింది. అంతేకాకుండా దీన్ని కొనసాగించాలని కంపెనీ యోచిస్తోంది. ఇక మరికొన్ని కంపెనీలు రెండు రకాల పాలసీలను తీసుకువచ్చేందుకు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి పూర్తిగా వర్క్ ఫ్రం హోం, మరోకటి ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రం హోంను ఉద్యోగులకు ఆఫర్ చేయాలని చూస్తున్నాయి. ఇక మెర్సిడెస్-బెంజ్ ఇండియా లాంటి కంపెనీలు హైబ్రిడ్ మోడల్పై పని చేస్తోంది. ఇది క్యాంపస్లో 50 శాతం నాన్-ప్రొడక్షన్ సిబ్బందితో రోస్టర్ విధానాన్ని అనుసరిస్తోంది.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..!