దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మరోసారి కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.29.90 లక్షల కోట్లకు చేరగా, మొత్తం లావాదేవీల సంఖ్య 23.2 బిలియన్లుగా నమోదైంది. విలువ, వాల్యూమ్ రెండింటి పరంగా ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో నమోదైన రూ.29.03 లక్షల కోట్లతో పోలిస్తే మేలో లావాదేవీల విలువ మరింత పెరిగింది. గత ఏడాది మేలో నమోదైన రూ.25.14 లక్షల కోట్లతో పోల్చితే ఇది సుమారు 19 శాతం వృద్ధిని సూచిస్తోంది.
ట్రాన్సాక్షన్లూ రికార్డే..
లావాదేవీల సంఖ్య పరంగా కూడా యూపీఐ కొత్త గరిష్ఠాన్ని తాకింది. మే నెలలో 23.2 బిలియన్ల ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. ఇది గత ఏప్రిల్లో నమోదైన 22.35 బిలియన్లను అధిగమించడమే కాకుండా, గత ఏడాది మేలో నమోదైన 18.67 బిలియన్లతో పోలిస్తే దాదాపు 24 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తోంది.
డిజిటల్ పేమెంట్స్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవి సెలవుల ప్రయాణాలు, ఐపీఎల్ నేపథ్యంలో పెరిగిన వినియోగదారుల ఖర్చులు, ఆన్లైన్ కొనుగోళ్లు యూపీఐ లావాదేవీల వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. వినియోగదారుల నుంచి వస్తున్న సహజమైన డిమాండ్ యూపీఐ వృద్ధిని మరింత బలోపేతం చేస్తోందని వారు పేర్కొంటున్నారు.


