ఇండియన్ రైల్వే ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 8,500 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సాధారణంగా.. ఈ స్టేషన్లలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణం చేస్తారు. అయితే.. ఒక రైల్వే స్టేషన్ మాత్రం.. అక్కడికి వెళ్లాలంటే తప్పనిసరిగా పాస్పోర్ట్, వీసా అవసరం. వినడానికి ఇది వింతగా అనిపించినా ఇది నిజం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ సమీపంలో 'అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్'.. భారతదేశంలో చివరి రైల్వే స్టేషన్గా పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. ఈ స్టేషన్ ద్వారా పాకిస్తాన్లోని లాహోర్కు వెళ్తారు. అందువల్ల.. ఈ స్టేషన్లో ప్రవేశించాలంటే భారతీయ పౌరులు కూడా తప్పనిసరిగా పాకిస్తాన్ వీసా కలిగి ఉండాలి.
ఇక్కడ రూల్స్ అన్నీ కూడా చాలా కఠినంగా అమలు చేస్తారు. ఎవరైనా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఈ స్టేషన్లోకి ప్రవేశిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫారిన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించినవారికి జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టేషన్ను సందర్శించాలనుకునే వారు ముందుగానే అన్ని అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
ఇదీ చదవండి: NHAI కొత్త రూల్.. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి!
ఈ స్టేషన్ నుంచి సంఝౌతా ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుంది. ఇది భారతదేశం, పాకిస్తాన్ మధ్య ప్రయాణికులను తీసుకువెళ్తుంది. అయితే, కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా ఈ రైలు కొన్ని సందర్భాల్లో నిలిపివేయడం కూడా జరిగింది. అటారి స్టేషన్లో భద్రతా ఏర్పాట్లు అత్యంత కట్టుదిట్టంగా ఉంటాయి. ఇక్కడ కూలీలు కూడా ఉండరు. కాబట్టి ప్రయాణికులు తమ లగేజ్ తామే మోసుకోవాల్సి ఉంటుంది. అటారీ శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ చిన్నదే అయినప్పటికీ.. మంచి సౌకర్యాలతో ఉంటుంది.


