గ్లోబల్‌గా పోటీకి సెజ్‌ల దన్ను | Union Budget 2026–27 introduced major reforms to boost India SEZs | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌గా పోటీకి సెజ్‌ల దన్ను

Apr 5 2026 5:30 AM | Updated on Apr 5 2026 6:13 AM

Union Budget 2026–27 introduced major reforms to boost India SEZs

2025–26లో డిసెంబర్‌ వరకు రూ. 11.70 లక్షల కోట్ల ఎగుమతులు 

32 శాతం వృద్ధి; 31.73 లక్షల మందికి ఉపాధి 

రూ. 7.86 లక్షల కోట్లకు పెట్టుబడులు 

సెజ్‌ల పురోగతిపై పీఐబీ ప్రకటన 

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత్‌ మరింతగా పోటీపడేందుకు ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌) తోడ్పడుతున్నాయి. దీనితో వీటిని బలోపేతం చేసే దిశగా 2026–27 కేంద్ర బడ్జెట్‌లో సమగ్ర సంస్కరణలు ప్రకటించారు. అంతర్జాతీయ వాణిజ్య మార్పులు, సరఫరా గొలుసు సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సెజ్‌లను తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు కీలకమని పేర్కొన్నారు. వీటిలో తయారైన ఉత్పత్తులను పరిమితంగా దేశీయ మార్కెట్‌లో తక్కువ సుంకంతో విక్రయించుకునే అవకాశం కల్పించారు. 

ఈ నేపథ్యంలో సెజ్‌ల పురోగతిపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం 2026 ఫిబ్రవరి 28 నాటికి దేశీయంగా నోటిఫై అయిన సెజ్‌ల సంఖ్య 368గా ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్‌ వరకు) రూ.11.70 లక్షల కోట్ల ఎగుమతులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 32.02 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం పెట్టుబడులు రూ.7.86 లక్షల కోట్లకు చేరగా, 31.73 లక్షల మందికి పైగా ఉపాధి లభించింది. ఈ గణాంకాలు భారత ఆర్థిక వృద్ధికి ఎస్‌ఈజెడ్‌ల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తున్నాయని పీఐబీ పేర్కొంది. 

సెజ్‌ల పరిణామక్రమం ఇలా: 1965లో కాండ్లాలో ఆసియాలోనే తొలి ఎగుమతి ప్రాసెసింగ్‌ జోన్‌ (ఈపీజెడ్‌)ని ఏర్పాటు చేసిన అనుభవంతో 2000లో సెజ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ చట్టం–2005 అమల్లోకి తెచ్చి, 2006 నుంచి అమలు ప్రారంభించారు. దీని కింద సింగిల్‌ విండో క్లియరెన్స్, సరళతరంగా నియంత్రణ, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించారు. వాణిజ్య, పెట్టుబడి వ్యవస్థకు మూల స్తంభాలైన సెజ్‌లు దేశీయంగా ప్రత్యేక డ్యూటీ–ఫ్రీ ప్రాంతాలుగా, కస్టమ్స్‌ పరిధి వెలుపల పని చేస్తున్నాయి. ఇక్కడి యూనిట్లలో ఉత్పత్తుల తయారీ, సేవలు, గిడ్డంగుల తదితర కార్యకలాపాలు ఉంటున్నాయి. 

2026–27 బడ్జెట్‌లో కీలక నిర్ణయం 
సాధారణంగా సెజ్‌ల నుంచి దేశీ టారిఫ్‌ ప్రాంతానికి (డీటీఏ) సరఫరాను దిగుమతులుగా పరిగణించి పూర్తి సుంకాలు విధిస్తారు. అయితే తాజా పరి స్థితుల నేపథ్యంలో ఉత్పత్తిలో కొంత భాగాన్ని త క్కువ సుంకాలతో డీటీఏలో విక్రయించునేందుకు సర్కార్‌ వెసులుబాటు కల్పించింది. ఖర్చులు తగ్గి, ఉత్పత్తి సామర్థ్యం పెరిగి, సెజ్‌లు బలోపేతం అయ్యేందుకు ఈ చర్యలు తోడ్పడనున్నాయి. మరో వైపు, టెక్నాలజీ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని సెజ్‌లలోని డేటా సెంటర్లకు పన్ను రాయితీలు, గ్లోబల్‌ టెక్‌ కంపెనీలను ఆకర్షించేలా విధానాల్లో మార్పు లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ కోసం ప్రత్యేక సెజ్‌ల ఏర్పాటును ప్రభుత్వం ప్రకటించింది. 2025 జూన్‌లో సాణంద్, ధార్వాడ్‌ ప్రాంతాల్లో కొత్త సెజ్‌లను నొటిఫై చేసింది. పెట్టుబడులకు ఊతమిచ్చేలా డ్యూటీ ఫ్రీ దిగుమతులు, రాష్ట్ర పన్ను రాయితీలు, సింగిల్‌ విండో అనుమతులు మొదలైన చర్యలు ఉంటున్నాయి. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement