వీసీ పెట్టుబడుల జోరు | India venture capital investments approximately 16 billion Dollers in 2025 | Sakshi
Sakshi News home page

వీసీ పెట్టుబడుల జోరు

Apr 5 2026 5:17 AM | Updated on Apr 5 2026 6:12 AM

India venture capital investments approximately 16 billion Dollers in 2025

2025లో 16 బిలియన్‌ డాలర్లు 

1,300 లావాదేవీలు 

వరుసగా రెండో ఏడాది అప్‌

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రైవేట్‌ క్యాపిటల్‌ మార్కెట్లు నెమ్మదించినప్పటికీ, భారత్‌లో వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) పెట్టుబడులు మాత్రం గతేడాది జోరుగానే వచ్చాయి. 2025లో 16 బిలియన్‌ డాలర్ల మేర వీసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అధికం. వివిధ స్థాయుల్లో 1,300 పైగా లావాదేవీలు జరిగాయి. గ్లోబల్‌ కన్సల్టెన్సీ సంస్థ బెయిన్‌ అండ్‌ కంపెనీ, ఇండియన్‌ వెంచర్‌ అండ్‌ ఆల్టర్నేట్‌ క్యాపిటల్‌ అసోసియేషన్‌ (ఐవీసీఏ) సంయుక్తంగా రూపొందించిన ఇండియా వెంచర్‌ క్యాపిటల్‌ రిపోర్ట్‌ 2026లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, లిక్విడిటీ కఠినతరం కావడం తదితర సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులు వృద్ధి చెందడం గమనార్హం. 2023లో రీసెట్‌ అయిన తర్వాత దేశీ వెంచర్‌ క్యాపిటల్‌ వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టిందని బెయిన్‌ అండ్‌ కంపెనీ అసోసియేట్‌ పార్ట్‌నర్‌ ఆదిత్య మురళీధర్‌ తెలిపారు. మెరుగైన గవర్నెన్స్,  సమర్ధవంతంగా పెట్టుబడుల వినియోగం, నిష్క్రమించేందుకు అవకాశాల పునాదులతో ఈ వ్యవస్థ దీర్ఘకాలికంగా నిలకడగా వృద్ధి చెందే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు.  నివేదిక ప్రకారం.. 

→ 50 మిలియన్‌ డాలర్ల లోపు డీల్స్‌ గణనీయంగా నమోదయ్యాయి. 

→ భారీ డీల్స్‌ కూడా పుంజుకున్నాయి. 250 మిలియన్‌ డాలర్లకు పైగా విలువ చేసే ఒప్పందాల సంఖ్య నాలుగు నుంచి రెట్టింపై ఎనిమిదికి చేరింది. యూనిట్‌ ఎకనామిక్స్‌ పటిష్టంగా ఉండి, మానిటైజేషన్‌పై స్పష్టత ఉన్న కంపెనీల వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. తీరుతెన్నూ లేని విస్తరణ కన్నా వ్యాపార నాణ్యతకే ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోంది. 

→ కన్జూమర్‌ టెక్‌ సంస్థలకు నిధులు నెమ్మదించాయి. అయితే దీర్ఘకాలిక సత్తాను ప్రదర్శిస్తూ, ఈ విభాగంలోకి పెట్టుబడులు 2023 నుంచి వార్షికంగా 25 శాతం స్థాయిలో పెరిగాయి. 

→ అన్ని ఉత్పత్తులు కాకుండా నిర్దిష్ట ప్రోడక్టులను మాత్రమే సత్వరం డెలివరీ చేసే క్విక్‌ కామర్స్‌ సంస్థల్లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ బాగా వచ్చాయి.  

→ టెక్నాలజీ ఆధారిత రంగాలు ఫండింగ్‌ రికవరీలో కీలక పాత్ర పోషించాయి. ఇందులో ఫిన్‌టెక్‌ రంగం ప్రత్యేకంగా నిల్చింది. ఈ విభాగంలో డీల్స్‌ విలువ వార్షికంగా సుమారు 2.2 రెట్లు పెరిగింది. పెట్టుబడుల్లో పేమెంట్స్‌ కేటగిరీ అత్యధిక వాటా దక్కించుకోగా, డిజిటల్‌ వినియోగం, కుటుంబాల పొదుపు మొత్తాల పెరుగుదలతో వెల్త్‌టెక్‌ డీల్స్‌ విలువ అయిదు రెట్లు పెరిగింది.  

→ సాఫ్ట్‌వేర్, సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఎ సర్వీస్‌) ఫండింగ్‌ 1.5 రెట్లు పెరిగింది. ఓ స్థాయికి చేరుకున్న ప్రస్తుత సంస్థలు కూడా మళ్లీ నిధుల బాట పట్టాయి. ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), జనరేటివ్‌ ఏఐ–నేటివ్‌ బీ2బీ కంపెనీలకు, ప్రధానంగా బ్యాంకింగ్, హెల్త్‌కేర్‌ రంగాల్లో వాటికి ఆదరణ లభిస్తోంది. 

→ దీర్ఘకాలిక ఇన్వెస్టర్లలో ధీమాని ప్రతిఫలిస్తూ, భారత్‌పై ఫోకస్‌ చేసే వీసీలు, గ్రోత్‌ ఈక్విటీ ఫండ్స్‌ సమీకరించిన నిధులు వార్షికంగా రెట్టింపై 5.4 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించుకుని వైదొలిగేందుకు కూడా గత ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. మొత్తం ఎగ్జిట్‌ విలువలో పబ్లిక్‌ మార్కెట్ల మార్గంలో జరిగినది 65 శాతంగా నమోదైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement