కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం చౌక ప్లాన్లను అందుబాటులోకి తెచ్చే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త ముసాయిదా ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం వాయిస్, ఎస్ఎంఎస్, డేటాతో కలిపి ఇస్తున్న స్పెషల్ టారిఫ్ ఓచర్లకు సరిసమాన కాల వ్యవధితో వాయిస్, ఎస్ఎంఎస్లకు సంబంధించి కూడా స్పెషల్ టారిఫ్ ఓచర్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ప్రతిపాదించింది. దీనితో పారదర్శకత పెరుగుతుందని, బలవంతంగా అవసరం లేని బండిల్డ్ సర్వీసులను తీసుకోవాల్సిన పరిస్థితి తప్పుతుందని పేర్కొంది.
టెలికం వినియోగదారుల హక్కుల పరిరక్షణ (పదమూడో సవరణ) నిబంధన 2026కి సంబంధించిన ఈ ప్రతిపాదనపై సంబంధిత వర్గాలు ఏప్రిల్ 28 నాటికి ట్రాయ్కి అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కూడా వాయిస్, ఎస్ఎంఎస్ల కోసం టెల్కోలు ప్రత్యేక ప్లాన్లను అందిస్తున్నప్పటికీ అవి సుదీర్ఘ వేలిడిటీతోనే ఇస్తున్నాయి. పైగా డేటా కూడా ఉండే బండిల్డ్ ప్లాన్ల కన్నా అధిక రేటును నిర్ణయించడమే కాకుండా, డేటాను తొలగించడం ద్వారా వినియోగదారులకు దక్కాల్సిన ప్రయోజనాలు ఆ స్థాయిలో అందించడం లేదు.
ఇదీ చదవండి: వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్!


