టీసీఎస్‌ బోణీ బాగుంది! ఇక ఏప్రిల్‌ 1 నుంచే వేతనాల పెంపు | TCS Q4 Financial Results | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ బోణీ బాగుంది! ఇక ఏప్రిల్‌ 1 నుంచే వేతనాల పెంపు

Apr 10 2026 9:23 AM | Updated on Apr 10 2026 11:15 AM

TCS Q4 Financial Results

ఐటీ పరిశ్రమలో ఆర్టిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ప్రభావాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఆకర్షణీయమైన ఫలితాలతో క్యూ4 సీజన్‌కి బోణీ కొట్టింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 12.22 శాతం వృద్ధితో రూ. 13,718 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. డిసెంబర్‌ త్రైమాసికం (క్యూ3)లో ఇది రూ. 10,657 కోట్లుగా ఉండగా, అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ4లో రూ. 12,224 కోట్లుగా నమోదైంది.

ఆదాయం రూ. 64,479 కోట్ల నుంచి సుమారు 10 శాతం వృద్ధితో రూ. 70,698 కోట్లకు ఎగిసింది. 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను టీసీఎస్‌ లాభం 1.35 శాతం వృద్ధితో రూ. 48,553 కోట్ల నుంచి రూ. 49,210 కోట్లకు చేరింది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 2.67 లక్షల కోట్లుగా నమోదైంది. ఒక్కో షేరుకు రూ. 31 చొప్పున తుది డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. దీనితో పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 39,571 కోట్ల మేర డివిడెండ్‌ ఇచ్చినట్లవుతుంది.

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు..

  • క్యూ4లో నిర్వహణ మార్జిన్‌ 24.2 శాతం నుంచి 25.3 శాతానికి పెరిగింది.  

  • వార్షికంగా 2.3 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండేలా క్యూ4లో ఏఐ ఆదాయాలు నమోదయ్యాయి.  

  • నాలుగో త్రైమాసికంలో 12 బిలియన్‌ డాలర్ల విలువ చేసే కొత్త డీల్స్‌ కుదిరాయి.

  • కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఏఐ నైపుణ్యాలకు ప్రాధాన్యతనిచ్చే ధోరణిని గతేడాది తరహాలోనే కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ కంపెనీ కొనసాగించనుంది.

ఉద్యోగులు పెరిగారు.. 
వరుసగా రెండు త్రైమాసికాల పాటు క్షీణించిన ఉద్యోగుల సంఖ్య క్యూ4లో మళ్లీ పెరిగింది. నికరంగా 2,356 మంది చేరడంతో మార్చి ఆఖరు నాటికి మొత్తం సంఖ్య 5,84,519కి చేరింది. ఉద్యోగాల కోత చేపట్టడం వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 23,460 మేర తగ్గింది.

వేతనాల పెంపు ఏప్రిల్‌ 1 నుంచే..
ఏప్రిల్‌ 1 నుంచి తిరిగి వేతనాల పెంపును అమలు చేసే విధానానికి మళ్లినట్లు టీసీఎస్‌ చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ సుదీప్‌ కున్నుమల్‌ తెలిపారు. గతేడాది ఇంక్రిమెంటు లభించని సీనియర్‌ సిబ్బంది ఈసారి అందుకోనున్నారు. టాప్‌ పర్ఫార్మర్‌లకు రెండంకెల స్థాయిలో పెంపు ఉంటుంది.

టెక్నాలజీపై పెట్టుబడులకు ఆసక్తి
సీక్వెన్షియల్‌గా వరుసగా మూడో క్వార్టర్‌లో వృద్ధిని సాధించాం. స్థూల ఆర్థిక పరిస్థితుల రీత్యా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, టెక్నాలజీపై కస్టమర్లు పెట్టుబడులు పెట్టడంపై ఆసక్తిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మాకు ఇది సానుకూలాంశంగా ఉంటుంది. 
– కె. కృతివాసన్, టీసీఎస్‌ సీఈవో, ఎండీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement