టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ‘టాటా సన్స్’ 2025–26 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, స్టాండలోన్ నికర లాభం రూ.31,961 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలోని రూ.26,232 కోట్లతో పోలిస్తే 21.8 శాతం అధికం. అదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం 9.1 శాతం పెరిగి రూ.42,367 కోట్లకు చేరింది. ఈ వృద్ధికి పెట్టుబడుల విక్రయం ద్వారా వచ్చిన లాభాలు, గ్రూప్ కంపెనీల నుంచి మెరుగైన ఆదాయం ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఈ బలమైన ఫలితాల నేపథ్యంలో టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.1,10,717 డివిడెండ్ సిఫార్సు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుకు రూ.64,900 డివిడెండ్ చెల్లించగా, ఈసారి దాదాపు 70 శాతం అధిక డివిడెండ్ ప్రకటించడం విశేషం. వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆమోదం లభిస్తే మొత్తం రూ.4,475 కోట్ల మేర డివిడెండ్ పంపిణీ చేయనుంది.
అయితే ఈ డివిడెండ్ సాధారణ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు అందదు. ఎందుకంటే టాటా సన్స్ ఒక లిస్టెడ్ కంపెనీ కాదు. దీంతో డివిడెండ్ ప్రయోజనం ప్రధానంగా కంపెనీ ప్రమోటర్లు, ట్రస్టులు, ప్రైవేట్ వాటాదారులకే పరిమితం అవుతుంది.
టాటా సన్స్లో సుమారు 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్టులు ఈ డివిడెండ్లో అత్యధిక లబ్ధిదారులు కానున్నారు. ముఖ్యంగా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్కు అత్యధిక వాటా లభించనుండగా, టాటా సన్స్లో 4,060 షేర్లు కలిగిన నోయెల్ టాటాకు సుమారు రూ.45 కోట్ల డివిడెండ్ అందనున్నట్లు వార్షిక నివేదికలో వెల్లడైంది.
వార్షిక నివేదికలో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఎయిర్ ఇండియా, టాటా డిజిటల్ వంటి సంస్థలు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నప్పటికీ, విమానయానం, సెమీకండక్టర్లు, బ్యాటరీలు, డిజిటల్ వ్యాపారాల్లో దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడులుగా వాటిని కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆల్టైమ్ రికార్డు లాభం


