రెండో రోజూ అదే జోరు

Sensex and Nifty End Higher For Second Day - Sakshi

13,600పై నిఫ్టీ ముగింపు

సెన్సెక్స్‌ లాభం 437 పాయింట్లు

ర్యాలీకి అండగా నిలిచిన ఐటీ, ఆటో, ఫార్మా, మెటల్‌

ముంబై: ఐటీ షేర్ల అండతో సూచీలు రెండోరోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 437 పాయింట్ల లాభంతో 46,444 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 13,601 వద్ద ముగిసింది. వరుస నష్టాలకు స్వస్తి పలుకుతూ రూపాయి బలపడటం మార్కెట్‌కు కలిసొచ్చింది. అలాగే కొత్తగా వెలుగులోకి వచ్చిన స్ట్రైయిన్‌ వైరస్‌ను కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ సమర్థవంతంగా ఎదుర్కోగలదని దిగ్గజ ఫార్మా కంపెనీలు విశ్వాసాన్ని వ్యక్తం చేయడంతో సెంటిమెంట్‌ బలపడింది.

ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి స్థిరంగా కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ ఒకదశలో 506 పాయింట్లు లాభపడి 46,513 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 291 పాయింట్ల ర్యాలీ చేసి 13,619 స్థాయిని తాకింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, అధికంగా ఐటీ షేర్లు లాభపడ్డాయి. రెండురోజులుగా జరిగిన కొనుగోళ్లతో సూచీలు సోమవారం కోల్పోయిన నష్టాలను దాదాపు తిరిగి పొందాయి. అలాగే మార్కెట్‌ పాజిటివ్‌ అవుట్‌లుక్‌ చెక్కుచెదరలేదని స్పష్టమైంది. దేశీయ ట్రేడింగ్‌ ప్రభావితం చేయగల ప్రపంచమార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. ఇక డాలర్‌ మారకంలో రూపాయి 8 పైసలు బలపడి 73.76 స్థాయి వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.537 కోట్ల విలువైన షేర్లను కొనగా, దేశీయ ఫండ్లు(డీఐఐలు) రూ.1326 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.

ఐటీ షేర్లకు భలే గిరాకీ...  
అంతర్జాతీయ మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ యాక్సెంచర్‌ ఫలితాల ప్రకటన నాటి నుంచి ఐటీ షేర్లకు మంచి డిమాండ్‌ నెలకొంది. యాక్సెంచర్‌ ఆర్థిక గణాంకాలు అంచనాలను మించడంతో పాటు మెరుగైన అవుట్‌లుక్‌ను ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఐటీ షేర్లు రాణిస్తున్నాయి. ఇక దేశీయంగా విప్రో, ఇన్ఫోసిస్‌ పెద్ద ఐటీ కంపెనీలు భారీ ఆర్డర్లను దక్కించుకోవడంతో ఇన్వెస్టర్లు ఈ రంగ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా జర్మన్‌ దిగ్గజం మెట్రో ఏజీ నుంచి విప్రో కంపెనీ 700 మిలియన్‌ డాలర్ల డీల్‌ను కుదుర్చుకుంది. అలాగే రూ.9,500 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను చేపట్టనుంది. ఈ సానుకూల పరిణామాలతో బుధవారం టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, టెక్‌ మహీంద్రా ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, ఎమ్‌ఫసిస్, బిర్లా సాఫ్ట్, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ షేర్లు సరికొత్త గరిష్టాలను తాకాయి.  

బ్రెగ్జిట్, లాక్‌డౌన్‌ ప్రభావాలే కీలకం...
మిడ్, స్మాల్‌క్యాప్‌ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో కొత్త వైరస్‌ స్ట్రైయిన్‌ భయాలు, లాక్‌డౌన్‌ ఆందోళనలు, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు వంటి ప్రతికూలతను విస్మరించి మార్కెట్‌ ముందుకు కదులుతుందని మార్కెట్‌ నిపుణులు తెలిపారు. త్వరలో ఖరారు కానున్న బ్రెగ్జిట్‌ ఒప్పందాలు, లాక్‌డౌన్‌ వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ఏమేర ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉందని నిపుణులు పేర్కొన్నారు.

15 రెట్లు సబ్‌స్క్రైబైన ఆంటోని వేస్ట్‌ హ్యాండ్లింగ్‌ సెల్‌ ఐపీఓ
ఆంటోని వేస్ట్‌ హ్యాండ్లింగ్‌ సెల్‌ ఐపీఓ చివరి తేది నాటికి 15 రెట్ల సబ్‌స్క్రిబ్షన్‌ను సాధించింది. ఇష్యూ లో భాగంగా కంపెనీ జారీ చేసిన 66.66 లక్షల షేర్లకు గానూ.., 10.02 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగం నుంచి 9.67 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ లభించగా.. నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి 18.69 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 16.55 రెట్ల బిడ్లు దాఖలమైనట్లు ఎన్‌ఎస్‌ఈ గణాం కాలు తెలిపాయి. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.300 కోట్లను సమీకరించింది. ఇష్యూ ధర శ్రేణి రూ.313–315గా ఉంది. జనవరి 1న షేర్లు ఎక్సే్ఛంజీల్లో లిస్టు కానున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top