స్టాక్ మార్కెట్లో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (SBI) షేర్లు శుక్రవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకి దిగారు. దీంతో ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్లో సుమారు రూ.67,932 కోట్ల మేర కోత పడింది.
ఇంట్రాడే ట్రేడింగ్లో ఎస్బీఐ షేరు 7.4 శాతం వరకు క్షీణించి రూ.1,011.30 వద్దకు పడిపోయింది. అనంతరం కొంత కోలుకున్నప్పటికీ, బీఎస్ఈలో 6.6 శాతం నష్టంతో రూ.1,019.60 వద్ద ముగిసింది. చివరికి షేరు రూ.1,018.40 వద్ద స్థిరపడింది.
ఈ పతనంతో ఎస్బీఐ మార్కెట్ విలువ రూ.9.40 లక్షల కోట్లకు తగ్గిపోయింది. 2024 జూన్ 4 తర్వాత ఎస్బీఐ షేరుకు ఇది అతిపెద్ద సింగిల్డే క్షీణతగా నమోదైంది.
లాభాలు పెరిగినా.. అంచనాలను అందుకోని ఫలితాలు
మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఎస్బీఐ రూ.19,684 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.6 శాతం వృద్ధి. అయితే మార్కెట్ విశ్లేషకులు రూ.20,030 కోట్ల లాభాన్ని అంచనా వేసిన నేపథ్యంలో ఫలితాలు నిరాశ పరిచాయి.
బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం కూడా 3.8 శాతం పెరిగి రూ.44,386 కోట్లకు చేరింది. కానీ విశ్లేషకుల అంచనా అయిన రూ.46,940 కోట్లను అందుకోలేకపోయింది.
ఇక బ్యాంకుల లాభదాయకతకు కీలకమైన నికర వడ్డీ మార్జిన్ మార్చి త్రైమాసికంలో 2.93 శాతంగా నమోదైంది. మార్జిన్లలో బలహీనత కనిపించడం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపింది.
52 వారాల గరిష్టం నుంచి 17% క్షీణత
ప్రస్తుతం ఎస్బీఐ షేరు 2026 ఫిబ్రవరి 24న నమోదైన 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,234.70తో పోలిస్తే 17.52 శాతం దిగువన ట్రేడ్ అవుతోంది. అయితే 2025 మే 9న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ.755.50తో పోలిస్తే ఇంకా 34.80 శాతం ఎగువన ఉంది.
వారం వ్యవధిలో ఎస్బీఐ షేరు 4.68 శాతం క్షీణించగా, అదే సమయంలో నిఫ్టీ-50 సూచీ 0.74 శాతం లాభపడింది. నెలరోజుల వ్యవధిలో కూడా షేరు 4.06 శాతం పడిపోగా, నిఫ్టీ 0.75 శాతం పెరిగింది.
అయితే దీర్ఘకాలికంగా చూస్తే ఎస్బీఐ షేరు మంచి రాబడులు అందించింది. 2026లో ఇప్పటివరకు 3.42% లాభం ఇచ్చింది. ఏడాది కాలంలో 32.43% పెరుగుదల నమోదు చేసింది. మూడేళ్లలో 74.50%, ఐదేళ్లలో 184.27% ర్యాలీ చేసింది.
గ్లోబల్ టెన్షన్.. బలహీనంగా ముగిసిన మార్కెట్లు
అమెరికా-ఇరాన్ మధ్య తాజా ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపగా, భారతీయ ఈక్విటీ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ-50 సూచీ 150.50 పాయింట్లు లేదా 0.62 శాతం పడిపోయి 24,176.15 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 516.33 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టపోయి 77,328.19 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ-50లో టైటాన్, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్క్యాప్ 0.15 శాతం, నిఫ్టీ స్మాల్క్యాప్ 0.22 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీ 62,113.85 వద్ద కొత్త ఆల్టైమ్ హైని నమోదు చేసింది.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, బ్యాంక్ సూచీలు భారీ నష్టాలు చవిచూశాయి. మరోవైపు నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరిచింది.


