breaking news
SBI shares
-
దూసుకెళ్ళిన ప్రభుత్వ బ్యాంక్ షేర్లు
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాలు నింగిని తాకుతున్నాయి .గురువారం నాటి మార్కెట్లో దేశీయ సూచీలు మెరుపులు మెరిపిస్తున్నాయి. మదుపర్ల భారీ కొనుగోళ్ళతో ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంక్ సూచీ రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 9.56 పంజాబ్ నేషనల్ బ్యాంకు 9.19శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.73 శాతం ఎగిశాయి. ఓబీసీ, యూనియన్ బ్యాంక్, సిండికేట్, అలహాబాద్ బ్యాంక్ కూడా ఇదే బాటలో పురోగమిస్తున్నాయి. అలాగే కెనరా బ్యాంక్ 7 శాతం, ఐసీఐసీఐ 6 శాతం, హెడ్డీఎఫ్సీ, 2 శాతం జంప్ చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్కువ డిపాజిట్లు, ముఖ్యంగా తక్కువ ధర డిపాజిట్ల నమోదుతో బ్యాంకుల లాభాలు కొనసాగనున్నాయని కోటక్ సెక్యూరిటీస్ సీఈవో కమేలేశ్ రావు అభిప్రాయపడ్డారు. అయితే, రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ సెక్టార్లోని బ్యాంకుల ఆస్తులపై అధిక ఒత్తిడి తప్పదని తెలిపారు. ప్రభుత్వ చర్యతో ద్రవ్యోల్బణం కట్టడవుతుందని, తద్వారా వడ్డీ రేట్లు తగ్గేందుకు వీలుచిక్కుతుందని, అంతేకాకుండా డిపాజిట్లు పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు చర్య దోహదపడుతుందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయంతో బుధవారం నాటి భారీ పతనంతో ఆకర్షణీయంగా ఉన్న ధరల్లో మదుపర్లు భారీగా కొనుగోళ్లకు దిగారు. దీంతో మెటల్ షేర్లతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. -
ఎస్ బీఐ లాభాలకీ బకాయిల దెబ్బ
ముంబై : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్ బీఐ నికర లాభాలను 66శాతం కోల్పోయింది. మొండిబకాయిల ఒక్కసారిగా రూ.1లక్ష కోటికి పెరగడంతో ఎస్ బీఐ తన నికర లాభాలు పడిపోయాయని ప్రకటించింది. శుక్రవారం వెల్లడించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో ఎస్ బీఐ కేవలం రూ.1,264 కోట్ల నికర లాభాలనే చూపించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఎస్ బీఐ నికర లాభాలు రూ.3,742 కోట్లగా ఉన్నాయి. మార్కెట్ విశ్లేషకులు భావించిన దానికంటే అధికంగానే ఎస్ బీఐ నికరలాభాలు పడిపోయాయి. గత త్రైమాసికంలో రూ.72,792 కోట్లగా ఉన్న స్థూల మొండిబకాయిలు ఈ త్రైమాసికంలో రూ.98,173 కోట్లకు ఎగబాకాయి. అదేవిధంగా వసూలు కాని రుణాల ప్రొవిజన్లు రూ.12,140 కోట్లగా నమోదయ్యాయి. ఇవి గత త్రైమాసికంలో రూ.7,645 కోట్లగానే ఉన్నాయి. అయితే మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ఎస్ బీఐ ఫలితాలు కొంత మెరుగ్గానే ఫలితాలను చూపించింది. చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ మార్చి త్రైమాసికంలో నష్టాలను నమోదుచేశాయి.12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ.20,500 కోట్ల నష్టాలను నమోదుచేశాయి. -
ఎస్బీఐకి మొండిబకాయిల సెగ
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్కు రూ. 3,241 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఏప్రిల్-జూన్లో ఆర్జించిన రూ. 3,752 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14% క్షీణత. ప్రధానంగా వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమల్లో(ఎస్ఎంఈ) పెరిగిన మొండిబకాయిలకు కేటాయింపులు లాభాలను దెబ్బతీశాయి. ఇవికాకుండా విదేశీ కార్యకలాపాలు, ఉద్యోగుల పెన్షన్కు చేపట్టిన రూ. 1,100 కోట్ల ప్రొవిజన్లు కూడా ప్రభావం చూపాయి. ఇదే కాలానికి బ్యాంకు ఆదాయం మాత్రం రూ. 32,415 కోట్ల నుంచి రూ. 36,193 కోట్లకు ఎగసింది. స్టాండెలోన్ ఫలితాలివి. కాగా, సమయానుకూల రుతుపవనాల కారణంగా వ్యవసాయం, ఎస్ఎంఈ రంగాలు పుంజుకునే అవకాశమున్నదని బ్యాంకు చైర్మన్ ప్రతీప్ చౌదరి పేర్కొన్నారు. యూఎస్ ట్రెజరీ బిల్లుల ద్వారా ఏర్పడ్డ నష్టాలకు రూ. 576 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టినట్లు వెల్లడించారు. దీంతోపాటు ఉద్యోగ సంబంధిత పెన్షన్లకు మరో రూ. 700 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. దీంతో లాభాలు ప్రభావితమయ్యాయని వివరించారు. ఉద్యోగుల సగటు జీవితకాల అంచనాను ఎల్ఐసీ ఐదేళ్లు పెంచడం ద్వారా 81 ఏళ్లకు చేర్చడంతో పెన్షన్ కేటాయింపులను చేపట్టాల్సి వచ్చినట్లు తెలిపారు. ఈ పద్దుకింద రానున్న మూడు క్వార్టర్లలో కూడా రూ. 600 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర 3.4% క్షీణించి రూ. 1,605 వద్ద ముగిసింది. ఒక దశలో 5%పైగా పతనమై రూ. 1,575ను తాకింది. కొత్త మొండిబకాయిలు: ప్రస్తుత సమీక్షా కాలంలో వ్యవసాయం నుంచి రూ. 3,245 కోట్లు, ఎస్ఎంఈ విభాగం నుంచి రూ. 2,500 కోట్ల చొప్పున మొండిబకాయిలు నమోదైనట్లు చౌదరి వివరించారు. మధ్యతరహా కార్పొరేట్ సంస్థల నుంచి కూడా బకాయిలు పెరిగినట్లు తెలిపారు. కొత్తగా నమోదైన రూ. 13,766 కోట్ల మొండిబకాయిల(వసూలు కానివి) కారణంగా మొత్తం ఆస్తులలో స్థూల మొండిబకాయిలు 4.99% నుంచి 5.56%కు పెరిగినట్లు వెల్లడించారు. ఇక నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.22% నుంచి 2.83%కు పెరిగాయి. కాగా, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 12% తగ్గి రూ. 4,299 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం రూ. 4,875 కోట్లు నమోదైంది. ఇదే కాలానికి బ్యాంకు ఆదాయం మాత్రం రూ. 46,839 కోట్ల నుంచి రూ. 52,502 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 3.5% పెరిగి రూ. 11,512 కోట్లకు చేరగా, ఇతర ఆదాయం 28% ఎగసి రూ. 4,474 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3.86% నుంచి 3.44%కు క్షీణించాయి. అయితే తొలుత ప్రకటించిన అంచనాలకు అనుగుణంగా 3.5-3.6% స్థాయిలో మార్జిన్లను నిలుపుకోగలమన్న ఆశాభావాన్ని చౌదరి వ్యక్తం చేశారు. విదేశీ కార్యకలాపాల మార్జిన్లు 1.5%గా నమోదైనట్లు అంతర్జాతీయ బ్యాంకింగ్ ఎండీ హేమంత్ జి.కాంట్రాక్టర్ చెప్పారు. ఈ కాలంలో రూ. 5,800 కోట్ల తాజా రుణాలను పునర్వ్యవస్థీకరించింది. అనుబంధ బ్యాంకును ఒకదానిని విలీనం చేసుకునే విషయాన్ని సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రకటించనున్నట్లు ఎస్బీఐ అనుబంధ కంపెనీల గ్రూప్ ఎగ్జిక్యూటివ్, ఎండీ ఎస్.విశ్వనాథన్ చెప్పారు.