
ప్రజాసాధికారత, వికసిత్ భారత్కు చేయూత
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: ఎస్బీఐ గత దశాబ్ద కాలంలో చేపట్టిన డిజిటల్ అభివృద్ధి (పూర్తి స్థాయిలో డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం) కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూర్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశానికి ఎస్బీఐ సేవలు అందించడం ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా చేసే ప్రయాణంలో ఎస్బీఐ ఇకముందూ కొత్త ఆవిష్కరణలతో ప్రజా సాధికారతకు చేయూతనిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘23,000కు పైగా శాఖలు. 78,000 కస్టమర్ సరీ్వస్ పాయింట్లు (సీఎస్పీలు), 64,000 ఏటీఎంలతో ఎస్బీఐ ఎంతో బలమైన స్థానంలో నిలిచింది. ప్రతి భారతీయుడికి అచ్చమైన బ్యాంక్’’అని ఎక్స్ ప్లాట్ఫామ్పై సీతారామన్ పోస్ట్ చేశారు. 1.5 కోట్ల మంది రైతులను ఆదుకోవడంలో, 1.3 కోట్ల మంది మహిళా స్వయం సహాయక గ్రూపులకు, పీఎం స్వనిధి కింద 32 లక్షల మంది వీధి వర్తకులకు, 23 లక్షల మంది ఎంఎస్ఎంఈలకు, చేతివృత్తుల వారికి వివిధ పథకాల కింద సహకారం అందించడంలో ఎస్బీఐ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. 15 కోట్ల జన్ధన్ ఖాతాలు, 14.65 కోట్ల పీఎం సురక్షా బీమా యోజన, 1.73 కోట్ల అటల్ పెన్షన్ యోజన, 7 కోట్ల పీఎం జీవన్జ్యోతి బీమా యోజన లబ్ధిదారులకు ఎస్బీఐ సేవలు అందిస్తున్నట్టు చెప్పారు.
40 లక్షల ఇళ్లకు సౌర కాంతులు
2027 మార్చి నాటికి 40 లక్షల గృహాలకు సౌర వెలుగులు అందించనున్నట్టు 70వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రకటించారు. సిబ్బంది, టెక్నాలజీ, సదుపాయాలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని తెలియజేస్తూ.. తద్వారా కోట్లాది మంది కస్టమర్లకు వేగవంతమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించనున్నట్టు చెప్పారు. కేవలం విస్తరణ దృష్టితో కాకుండా దీర్ఘకాలంలో ప్రతి ఒక్క భాగస్వామికి విలువ చేకూర్చేందుకు, మరింత సమానత్వంతో కూడిన, బలమైన భవిష్యత్ దిశగా దేశం సాధికారత సాధించేందుకు ఎస్బీఐ కృషి చేస్తుందని ప్రకటించారు. రూ.66 లక్షల కోట్ల బ్యాలెన్స్ïÙటు, 52 కోట్లకు పైగా కస్టమర్లతో ఎస్బీఐ.. సుస్థిరత, డిజిటల్ ఆవిష్కరణలు, సమ్మిళిత వృద్ధిపై దృష్టితో ఎనిమిదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్నట్టు తెలిపారు. ఎస్బీఐ 1955 జూలై 1న సేవలు ప్రారంభించడం గమనార్హం.