వెంచర్ క్యాపిటల్, ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో సగానికి క్షీణించాయి. వెరసి ఏప్రిల్లో 38 డీల్స్ ద్వారా 2.7 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా డాలరుతో మారకంలో రూపాయి క్షీణత, రాజకీయ భౌగోళిక ఆందోళనలు దెబ్బతీశాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025 ఏప్రిల్తో పోలిస్తే విలువలో 50 శాతం తగ్గాయి.
2026 ఏప్రిల్లో 83 లావాదేవీలు నమోదయ్యాయి. ఇవి 29 నెలల కనిష్టంకాగా.. గతేడాది ఏప్రిల్లో 134, ఈ ఏడాది మార్చిలో 131 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. డాలరుతో మారకంలో రూపాయి 96 స్థాయికి పడిపోవడం, అధికస్థాయిలలో కొనసాగుతున్న ముడిచమురు ధరలు, రాజకీయ భౌగోళిక ఆందోళనలు పెట్టుబడులను ప్రభావితం చేసినట్లు ఈవై పార్ట్నర్ వివేక్ సోనీ పేర్కొన్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ ఆల్టర్నేటివ్స్ 28.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు గత నెలలో నమోదైన అతిపెద్ద డీల్గా నివేదిక తెలియజేసింది. బెంగళూరు, పుణేలలో ఆర్ఎంజెడ్ కార్యాలయ ఆస్తులలో ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది.


