Reliance Jio Platforms To Acquire Mimosa Networks, Details Here - Sakshi
Sakshi News home page

జియో చేతికి యూఎస్‌ కంపెనీ.. 5జీ, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు మద్దతు

Mar 10 2023 5:42 AM | Updated on Mar 10 2023 8:37 AM

Reliance Jio Platforms to acquire Mimosa Networks - Sakshi

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ తాజాగా యూఎస్‌ కంపెనీ మిమోసా నెట్‌వర్క్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకు 6 కోట్ల డాలర్ల(రూ. 492 కోట్లు) విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కమ్యూనికేషన్‌ సంబంధ పరికరాలు తయారు చేసే మిమోసా కొనుగోలుతో 5జీ టెలికం, బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను మరింత విస్తరించేందుకు వీలు చిక్కనుంది. అనుబంధ సంస్థ రాడిసిస్‌ కార్పొరేషన్‌ ద్వారా తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్‌ పేర్కొంది.

రుణరహిత, క్యాష్‌ ఫ్రీ ప్రాతిపదికన మిమోసాను సొంతం చేసుకునేందుకు ఎయిర్‌స్పాన్‌ నెట్‌వర్క్స్‌ హోల్డింగ్స్‌తో 6 కోట్ల డాలర్లకు ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. మిమోసా వైఫై–5 ఆధారిత పాయింట్‌ టు మల్టీపాయింట్‌ ప్రొడక్టులతోపాటు.. ఆధునిక వైఫై 6ఈ టెక్నాలజీలు, సంబంధిత పరికరాల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. 2018లో మిమోసాను ఎయిర్‌స్పాన్‌ కొనుగోలు చేసింది. కాగా..  చైనీస్‌ టెక్నాలజీ నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దూరం జరుగుతున్న నేపథ్యంలో మిమోసా కొనుగోలు జియో ప్లాట్‌ఫామ్స్‌కు కీలకంగా నిలవనుంది. మిమోసాకు జియో ప్రధాన కస్టమర్‌కావడం గమనార్హం!

Advertisement
 
Advertisement
Advertisement