ఆర్బీఐ నుంచి ఈ ఏడాదీ కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ వర్షం కురవనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో ఎన్నో సవాళ్లు ఎరువుతుండడం తెలిసిందే. కరెంట్, ద్రవ్యలోటు పెరిగిపోనున్న నేపథ్యంలో ఆర్బీఐ నుంచి పెద్ద మొత్తంలో డివిడెండ్ రావొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలో జరిగే బోర్డు సమావేశంలో డివిడెండ్పై ఆర్బీఐ నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పాయి.
గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రూ.2.69 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కింద పంపిణీ చేసింది. 2024–25లో రూ.2.11 లక్షల కోట్లతో పోల్చితే 27 శాతం పెరిగింది. ఆర్బీఐ, ప్రభుత్వరంగ బ్యాంక్లు, సంస్థల నుంచి డివిడెండ్ల రూపంలో రూ.3.16 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని 2026–27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 3.75 శాతం అధికం. ఇందులో రూ.75,000 కోట్లు ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్లు, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో వస్తుందని అంచనా వేసింది.


