ఒకప్పుడు ఐటీలో కొలువంటే చాలామంది ఎగిరి గంతేసేవారు. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియక కొంతమంది బిక్కుబిక్కుమనే రోజుల్లో టెకీలు బతికేస్తున్నారు. ఏ ఉదయం ఏ మెయిల్ వస్తుందో తెలియదు. ఏ కారణం చేత జాబ్ పోతుందో తెలియదు. ఇలాంటి సమయంలో ఓ కంపెనీ చెప్పాపెట్టకుండా క్లోజ్ అయింది. దీంతో 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
పుణెలోని హింజవాడి ఫేజ్-2లో ఉన్న థింక్ టెక్నాలజీ ఇండియా అనే ఐటీ సంస్థ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. రాత్రికి రాత్రే కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ ఘటనతో 700 మందికి పైగా ఉద్యోగులు, ఇంటర్న్స్, ఫ్రెషర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపెనీ వారికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం, చెక్కులు బౌన్స్ కావడం, ఉద్యోగుల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం వంటివి కూడా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ప్రారంభంలో భారీ నియామకాలు
థింక్ టెక్నాలజీ ఇండియా 2025లో పెద్ద మొత్తంలో నియామకాలను చేపట్టింది. ఇందులో ఫ్రెషర్స్, ఇంటర్న్స్, ఎక్స్పీరియన్స్ ఉద్యోగులు కూడా ఉన్నారు. మొదట్లో సంస్థ అందరికీ జీతాలు, స్టైఫండ్స్ క్రమంగా చెల్లించింది. దీంతో ఉద్యోగుల్లో సంస్థపై నమ్మకం పెరిగింది.
అయితే.. 2026 ప్రారంభం నుంచి పరిస్థితులు మారాయి. ఫిబ్రవరి నుంచి జీతాల చెల్లింపుల విషయంలో ఆలస్యం జరిగిందని ఉద్యోగులు పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి నెల 7 లేదా 8వ తేదీకి జమయ్యే జీతాలు ఆగిపోవడంతో ఉద్యోగులు యాజమాన్యాన్ని సంప్రదించారు. ఈ సమయంలో సంస్థ సీఈఓ హర్షల్ భానుదాస్ ఠాక్రే ఆడిట్ జరుగుతోందని, ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య పెండింగ్ జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు
సీఈఓ ఇచ్చిన హామీ ప్రకారం.. జీతాలు రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. అయితే కొన్ని రోజులకు సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్లు గుర్తించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా.. సంస్థ మూతపడటంతో ఉద్యోగులు షాక్కు గురయ్యారు. ఇదే సమయంలో కంపెనీ ఇచ్చిన కొన్ని జీతాల చెక్కులు బ్యాంకుల్లో బౌన్స్ అయినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు, లోన్స్ చెల్లింపులు చేయలేక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ వ్యవహారంలో ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (FITE) జోక్యం చేసుకుంది. బాధిత ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఫైట్ అధ్యక్షుడు పవంజీత్ మానే తెలిపారు. పోలీసులకు కూడా ఫిర్యాదులు అందజేసినట్లు వెల్లడించారు.
మరో ముఖ్యమైన ఆరోపణ ఏమిటంటే.. ఉద్యోగులకు ల్యాప్టాప్లు అందిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.15,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమని తేలితే సంస్థ ఉద్యోగులతో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు జరిపినట్లు స్పష్టమవుతుంది.
భద్రతపై చర్చ
ఈ ఘటన మరోసారి భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై చర్చకు తెరలేపింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా ఐటీ సంస్థలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని ఉద్యోగి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. జీతాల చెల్లింపులు, ఆర్థిక పారదర్శకత, ఉద్యోగుల రక్షణ కోసం మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసు విచారణ కొనసాగుతోంది. జీతాల బకాయిలు, బౌన్స్ అయిన చెక్కులు, ఉద్యోగుల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: గూగుల్కు రూ.30 లక్షల జరిమానా!


