ఎస్‌యూవీలకే డిమాండ్‌ | Passenger vehicle sales rise 13. 5percent in May | Sakshi
Sakshi News home page

ఎస్‌యూవీలకే డిమాండ్‌

Jun 2 2023 3:38 AM | Updated on Jun 2 2023 3:38 AM

Passenger vehicle sales rise 13. 5percent in May - Sakshi

న్యూఢిల్లీ: ఎస్‌యూవీలకు బలమైన డిమాండ్‌తో దేశీయ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ రంగంలో మే నెలలో విక్రయాల జోరు సాగింది. మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ బలమైన హోల్‌సేల్‌ అమ్మకాలను నమోదు చేశాయి. టాటా మోటార్స్, కియా, ఎంజీ మోటార్‌ ఇండియా వంటి ఇతర తయారీ సంస్థలు సైతం విక్రయాల్లో వృద్ధి సాధించాయి.

అగ్రశ్రేణి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా మొత్తం దేశీయ ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 15 శాతం పెరిగి 1,43,708 యూనిట్లుగా నమోదయ్యాయి. ఆల్టో, ఎస్‌–ప్రెస్సోతో కూడిన మినీ కార్ల అమ్మకాలు 30 శాతం తగ్గి 12,236 యూనిట్లకు పడిపోయాయి. స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్‌ వంటి మోడళ్ల విక్రయాలు 5 శాతం పెరిగి 71,419 యూనిట్లకు చేరాయి.

బ్రెజ్జా, గ్రాండ్‌ విటారా, ఎర్టిగాతో సహా యుటిలిటీ వాహనాల సేల్స్‌ 65 శాతం అధికమై 46,243 యూనిట్లకు చేరాయి. గత నెలలో కంపెనీ రెండంకెల అమ్మకాల వృద్ధికి ఎస్‌యూవీలు క్రెటా, వెన్యూ ఆజ్యం పోశాయని హ్యుందాయ్‌ ఇండియా సీవోవో తరుణ్‌ గర్గ్‌ తెలిపారు. టాటా మోటార్స్‌ అంతర్జాతీయ వ్యాపారంతో సహా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు 66% వృద్ధితో 5,805 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 3,505 యూనిట్లు విక్రయించామని కంపెనీ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement