హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్టెక్ రూ. 51 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 24 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఇక ఆదాయం 45 శాతం వృద్ధితో రూ. 438 కోట్ల నుంచి రూ. 635 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 29 శాతం పెరిగి రూ. 139 కోట్ల నుంచి రూ. 180 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 1,802 కోట్ల నుంచి రూ. 2,312 కోట్లకు ఎగిసింది.
ఒక్కో షేరుపై కంపెనీ 15 శాతం (రూ. 0.60) మేర తుది డివిడెండు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 32 శాతం అధికంగా 1,280 ఈవీలను డెలివర్ చేసింది. 10,161 ఎలక్ట్రిక్ వాహనాలకు ఆర్డర్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఆదాయాలు, లాభదాయకత, పటిష్టమైన ఫండమెంటల్స్ తదుపరి దశ వృద్ధికి పటిష్టమైన పునాదులుగా నిలుస్తాయని ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎండీ మహేష్ బాబు చెప్పారు.


